న్యూఢిల్లీ: అంతా చూస్తుండగా ఒక వ్యక్తి గొంతు కోసి, తల పగులగొట్టి దారుణంగా హత్య చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. ఆదర్శ్ నగర్కు చెందిన నరేంద్ర అలియాస్ బంటి, ఉత్తర ఢిల్లీ పరిసరాల్లో నేరస్థుడిగా పేరు పొందాడు. శుక్రవారం మరో నేరగాడైన రాహుల్ను డ్రగ్స్ కోసం డబ్బులను అతడు డిమాండ్ చేశారు. దీంతో ఇది ఘర్షణకు దారి తీసింది. ఈ నేపథ్యంలో రాహుల్ కాలి, అతడి సోదరుడు రోహిత్ కాలి కలిసి నరేంద్రపై దాడి చేశారు. బ్లేడ్తో అతడి గొంతు కోశారు. రాళ్లు, రాడ్లతో తల పగులగొట్టారు. అనంతరం అక్కడి నుంచి పారిపోయారు. అయితే స్థానికులు ఇదంతా చూసినప్పటికీ నరేంద్రను కాపాడేందుకు ఎవరూ ముందుకు రాలేదు.
మరోవైపు ఈ దాడి గురించి పోలీసులకు సమాచారం అందింది. దీంతో వారు వెంటనే అక్కడకు వచ్చారు. తీవ్రంగా గాయపడిన నరేంద్రను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ అతడు మరణించాడు. దీంతో పోలీసులు హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. స్థానిక సీసీటీవీలో రికార్డైన ఈ ఘటన వీడియో ఫుటేజ్ను పరిశీలించారు. నిందితులైన అన్నాదమ్ముల్లో ఒకడైన రాహుల్ కాలిని పోలీసులు అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న రోహిత్ కాలి కోసం గాలిస్తున్నారు.