Crime News : భర్తను చంపేసి, పొట్ట కోసి, అతడి పొట్టలోని అవయవాలను సంచిలో నింపిన అమానుష ఘటన హర్యానా (Haryana) లోని కురుక్షేత్ర (Kurukshetra) లో జరిగింది. భర్తను కిరాతకంగా హత్య చేసిన ఓ మహిళ.. అతని శరీరాన్ని ఛిద్రం చేసింది. పొట్ట కోసి పేగులు సంచిలో నింపుతుండగా ఇంటి యజమాని చూశాడు. అడ్డంగా దొరికిపోవడంతో భయంతో ఆమె టెర్రస్ పైనుంచి దూకి ఆత్మహత్యాయత్నం (Suicide attempt) చేసింది. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.
వివరాల్లోకి వెళ్తే.. పీహోవా రోడ్డులోని రాజ్ ప్యాలెస్ సమీపంలో రాజేశ్, విమలా దేవి దంపతులు ఓ అద్దె ఇంట్లో నివసిస్తున్నారు. ఉత్తరప్రదేశ్కు చెందిన రాజేశ్ స్థానికంగా ఓ వాటర్ ట్రేడింగ్ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఆదివారం సాయంత్రం 5 గంటల సమయంలో వీరిద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. వారి ఇంట్లోంచి పెద్దగా అరుపులు వినిపించడంతో ఇంటి యజమాని రింకూ వారిని చూసేందుకు టెర్రస్పైకి వెళ్లాడు. అక్కడ కనిపించిన దృశ్యం చూసి ఒక్కసారిగా షాక్కు గురయ్యాడు.
రాజేశ్ రక్తపు మడుగులో పడి ఉండగా.. అతని పొట్ట భాగం చీల్చి ఉంది. బయటకు వచ్చిన పేగులను విమల ఓ సంచిలో పెడుతుండటం అతను గమనించాడు. ఇంతలో తనను ఇంటి యజమాని చూశాడని గ్రహించిన విమల కంగారుతో టెర్రస్పై నుంచి కిందికి దూకేసింది. గాయపడిన ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు, ఫోరెన్సిక్ నిపుణులు ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు.
పోస్టుమార్టం నివేదికలో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. రాజేశ్ పొట్టపై సుమారు 35 సెంటీమీటర్ల పొడవున కోసి ఉంది. అతని శరీరం నుంచి కాలేయంలో కొంత భాగం, కుడివైపు కిడ్నీ మాయమైనట్టు వైద్యులు గుర్తించారు. ఘటనా స్థలంలో మూడు వేర్వేరు పరిమాణాల్లో ఉన్న కత్తులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విమల క్షుద్రపూజలు, చేతబడి వంటివి చేస్తుండేదని, ఈ విషయమై దంపతుల మధ్య తరచూ గొడవలు జరిగేవని ఇంటి యజమాని పోలీసులకు తెలిపాడు.
కొన్నేళ్ల క్రితం వివాహం చేసుకున్న ఈ దంపతులకు పిల్లలు లేరు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విమల కోలుకుని వాంగ్మూలం ఇస్తేనే ఈ హత్య వెనుక ఉన్న పూర్తి వివరాలు, అసలు కారణాలు తెలిసే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. ఈ దారుణ ఘటనపై కేసు నమోదుచేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.