లక్నో : యూపీలో దారుణ ఘటన వెలుగుచూసింది. 13 ఏండ్ల వయసులో లైంగిక దాడికి గురైన మహిళ 27 ఏండ్ల తర్వాత కేసు నమోదు చేసిన ఉదంతం షహజన్పూర్లో చోటుచేసుకుంది. బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా లైంగిక దాడి కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని గుర్తించారు. కోర్టు ఆదేశాలకు అనుగుణంగా మహిళ సదర్ బజార్ పోలీస్ స్టేషన్లో 2021 మార్చి 4న కేసు నమోదు చేసింది.
ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం మహిళ 1994లో అక్క, బావలతో కలిసి నివసించింది. ఒకరోజు ఆమె ఒంటరిగా ఉన్న సమయంలో నకి హసన్ అనే వ్యక్తి ఆయన డ్రైవర్ కలిసి ఇంట్లోకి చొరబడి బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డారు. మరుసటి రోజు నిందితుడు హసన్ సోదరుడు గుడ్డు ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధితురాలు గర్భం దాల్చడంతో విషయం కుటుంబ సభ్యులకు తెలిపింది. బాలిక మగబిడ్డకు జన్మనిచ్చి హర్దోయ్లోని పిల్లలు లేని దంపతులకు శిశువును అందచేసింది.
ఆపై ఘజీపూర్లోని ఓ వ్యక్తిని మహిళ పెండ్లి చేసుకుంది. పదేండ్ల తర్వాత లైంగిక దాడి విషయం తెలిసిన భర్త ఆమె నుంచి విడిపోయాడు. మరోవైపు ఇప్పుడు పెద్దయిన కుమారుడు తండ్రి గురించి మహిళను వాకబు చేశాడు. వాస్తవం తెలిసిన తర్వాత న్యాయం కోరాలని కొడుకు చెప్పడంతో మహిళ కేసు దాఖలు చేసింది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడు అతడి సోదరుడిని గుర్తించి అరెస్ట్ చేశారు. ఈ కేసులో సాక్షులు ఎవరూ లేనందున డీఎన్ఏ పరీక్ష నిర్వహించామని తదుపరి దర్యాప్తు కోసం ప్రత్యేక బృందం ఏర్పాటు చేశామని ఎస్పీ సంజయ్ కుమార్ తెలిపారు.