Trisha | టాలీవుడ్, కోలీవుడ్ లో లెజెండరీ హీరోయిన్గా పేరు తెచ్చుకున్న అందాల త్రిష పెళ్లి గురించి మళ్లీ చర్చలు ఊపందుకున్నాయి. తాజాగా కోలీవుడ్ సర్కిల్స్లో త్రిష పెళ్లికి సంబంధించిన వార్తలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. తల్లిదండ్రులు చూసిన సంబంధానికి ఆమె ఓకే చెప్పిందనే టాక్ నడుస్తుంది. త్రిష గతంలో బిజినెస్ మ్యాన్ వరుణ్ మనియన్తో నిశ్చితార్దం చేసుకున్న విషయం తెలిసిందే. ఆ నిశ్చితార్దం పెళ్లివరకు దారి తీస్తుందని అనుకోగా, అనూహ్యంగా అది రద్దయింది. అప్పటి నుంచి త్రిష తన కెరీర్పైనే దృష్టి సారించింది. మనసుకు నచ్చినవాడు దొరికితే తప్పక పెళ్లి చేసుకుంటాను అని త్రిష గత కొన్నాళ్లుగా చెబుతూ వస్తుంది.
తాజా సమాచారం ప్రకారం, త్రిష తల్లిదండ్రులు చండీఘర్కు చెందిన ఓ కుటుంబంతో సంబంధం కుదిర్చినట్లు తెలుస్తోంది. ఆ యువకుడు ఆస్ట్రేలియాలో స్థిరపడి బిజినెస్ చేస్తున్నట్టు సమాచారం. ఇటీవల తన వ్యాపారాన్ని భారత్లో విస్తరించాడని కూడా చెబుతున్నారు. రెండు కుటుంబాలు దగ్గరైన నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకుని త్రిష కూడా ఈ సంబంధానికి ఓకే చెప్పినట్లు కోలీవుడ్లో చర్చ నడుస్తుంది. అయితే ఈ విషయంపై త్రిష నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ప్రస్తుతం త్రిష చిరంజీవి హీరోగా నటిస్తున్న భారీ చిత్రం ‘విశ్వంభర’ లో నటిస్తోంది. అదే సమయంలో తమిళంలో ‘కరుప్పు’ అనే చిత్రంలోనూ కీలక పాత్ర పోషిస్తోంది. ఇవే ప్రస్తుతం ఆమె చేతిలో ఉన్న ప్రధాన ప్రాజెక్టులు.
మునుపటి క్రేజ్ తగ్గిన నేపథ్యంలో ఈ రెండు సినిమాలపై చాలా ఆశలు పెట్టుకుంది త్రిష. ఇక బాలీవుడ్లో కూడా త్రిష రీఎంట్రీకు ప్లాన్ చేస్తోందన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఒక్క సినిమాతో బాలీవుడ్ ప్రయాణాన్ని ఆపేసిన త్రిష, ఇప్పుడు మళ్లీ తన అదృష్టాన్ని పరీక్షించాలనుకుంటుందట. మరి తాజాగా త్రిష పెళ్లికి సంబంధించి జరుగుతున్న ప్రచారంలో నిజం ఎంత ఉంది అన్నది తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే. కానీ ఈ సారి మాత్రం త్రిష నిజంగానే పెళ్లి పందిరిలోకి అడుగుపెడుతుంది అన్న ఆశాభావం అభిమానుల్లో స్పష్టంగా కనిపిస్తోంది.