బాక్సాఫీస్ వద్ద ‘సలార్’ సృష్టించిన వేడి ఇంకా చల్లారలేదు. గత ఏడాది విడుదలైన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 715కోట్ల రూపాయల గ్రాస్ని వసూలు చేసి ప్రభాస్ స్టామినాను మరోసారి రుజువు చేసింది. ఈ సినిమా చివర్లో సెకండ్ పార్ట్ ‘శౌర్యాంగపర్వం’ పేరుతో రాబోతున్నదని దర్శకుడు ప్రశాంత్నీల్ తెలియజేశారు. ప్రస్తుతమైతే ప్రభాస్ ‘కల్కి 2898’ షూటింగ్లో బిజీగా ఉన్నారు. మరోవైపు మారుతీ దర్శకత్వంలో ‘రాజాసాబ్’ సినిమా కూడా చేస్తున్నారు. మరి ‘శౌర్యాంగపర్వం’ ఎప్పుడు? అనేది అభిమానులను వెంటాడుతున్న ప్రశ్న.
‘సలార్’లో కీలక పాత్రలు పోషించిన నటులు పృథ్వీరాజ్ సుకుమారన్, బాబీ సింహా విడివిడిగా ఆ ప్రశ్నకు సమాధానాలు ఇచ్చేశారు. ‘సలార్’ రెండో భాగం షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందని చాలా మంది అడుగుతున్నారు. నాకూ ఆతృతగానే వుంది. త్వరలోనే రెండో భాగం షూటింగ్ మొదలుకానుంది. దానికి సంబంధించిన ఏర్పాట్లను ప్రశాంత్నీల్ దాదాపు పూర్తి చేశారు’ అని పృథ్వీరాజ్ చెప్పారు. అలాగే, నటుడు బాబీసింహా కూడా ఓ ఇంటర్వ్యూలో ‘శౌర్యాంగపర్వం’పై అప్డేట్ ఇచ్చేశారు. వచ్చే నెలలో షూటింగ్ ప్రారంభమవ్వనున్నట్టు ఆయన తెలిపారు. వచ్చే ఏడాది సినిమా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టు ఈ ఇంటర్వ్యూలో బాబీ సింహా చెప్పారు. ప్రభాస్ అభిమానులకు ఇది నిజంగా శుభవార్తే అనాలి.