‘మా’ అధ్యక్షుడు నరేష్, హీరో శ్రీకాంత్ మధ్య మాటల యుద్ధం తెలుగు చిత్రసీమలో చర్చనీయాంశంగా మారింది. ఒకరిపై మరొకరు విమర్శనాస్ర్తాల్ని సంధించుకుంటున్నారు. తాజాగా ఇటీవల విడుదల చేసిన వీడియో బైట్లో తనను ఉద్దేశించి శ్రీకాంత్ చేసిన వ్యాఖ్యలను నరేష్ తప్పుబట్టారు. శ్రీకాంత్ మాటలు తనను బాధించాయని తెలిపారు. నరేష్ మాట్లాడుతూ ‘ప్రమాదం జరిగిన రోజు సాయిధరమ్తేజ్ స్పీడుగా వెళ్లలేదు. ఇసుక కారణంగా జారిపడ్డాడు. ఈ ప్రమాదంపై నేను చెప్పిన మాటలు మీడియాలో వేరే విధంగా వచ్చాయి. ఈ విషయమై ఇండస్ట్రీ పెద్దలు ఫోన్ చేయడంతో వాస్తవాలేమిటో చెప్పాను. చనిపోయిన వాళ్ల గురించి నేను మాట్లాడలేదు. ఇండస్ట్రీలో జరిగిందే చెప్పా’ అని అన్నారు. జాగ్రత్తగా ఉండాలంటూ శ్రీకాంత్ను హెచ్చరించారు నరేష్. ‘మంచి సినిమాలు చేసి పేరుతెచ్చుకున్నావు. ‘మా’ ఎన్నికల్లో పోటీ చేసి మా ప్యానల్ చేతిలో ఓడిపోయావు. ఇంకోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేయొద్దు. నేను యాభై ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నా. వీడియో బైట్స్ కారణంగా నాకెప్పుడూ చెడ్డ పేరు రాలేదు’ అని నరేష్ దుయ్యబట్టారు. సాయిధరమ్తేజ్ ప్రమాదంతో నరేష్, శ్రీకాంత్ల మధ్య గొడవ మొదలైంది. యాక్సిడెంట్ జరిగిన రోజు నరేష్ వీడియో ద్వారా స్పందించారు. గతంలో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో కోట శ్రీనివాసరావు, బాబూమోహన్ కుమారులు ప్రమాదాలకు గురై విషాదాన్ని మిగిల్చారన్నారు. నరేష్ వ్యాఖ్యలపై శ్రీకాంత్ ప్రతిస్పందిస్తూ వీడియో బైట్స్ ఇచ్చే ముందు ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాలని హెచ్చరించారు. ప్రమాదం జరిగిన వ్యక్తి కుటుంబం తీవ్ర ఆందోళనలో ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా మాట్లాడాలని మందలించారు. చనిపోయిన వారి గురించి వీడియోలో నరేష్ మాట్లాడకుండా ఉంటే బాగుండేదని ఆగ్రహం వ్యక్తం చేశారు శ్రీకాంత్. ఈ వివాదం ఇద్దరి మధ్య మాటల యుద్ధానికి తెరతీసింది.