Samantha | టాలీవుడ్లో బైలింగ్వల్ ప్రాజెక్ట్గా తెరకెక్కిన డెకాయిట్ సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. అడివి శేష్, మృణాల్ ఠాకూర్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రాన్ని కొత్త దర్శకుడు షానియల్ డియో రూపొందిస్తున్నారు. ఏప్రిల్ 10న తెలుగు, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్లు, ట్రైలర్లు, ప్రమోషనల్ కంటెంట్ ఈ సినిమాపై మంచి అంచనాలను పెంచాయి. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ‘డెకాయిట్’ గురించే చర్చ నడుస్తోంది. చిత్ర బృందం కూడా దూకుడుగా ప్రమోషన్స్ నిర్వహిస్తూ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది.
ఈ నేపథ్యంలో స్టార్ హీరోయిన్ సమంత ఈ సినిమాకు తన బెస్ట్ విషెస్ తెలియజేయడం విశేషంగా మారింది. సోషల్ మీడియా వేదికగా ఆమె నిర్మాత సుప్రియ యార్లగడ్డను ఉద్దేశిస్తూ భావోద్వేగపూర్వకంగా పోస్ట్ పెట్టింది. సుప్రియ… నీ కృషి, పట్టుదల, సినిమాపై నీ అంకితభావాన్ని నేను దగ్గరగా చూశాను. బ్లాక్బస్టర్ విజయం కోసం నువ్వు అర్హురాలు. దేవుడి ఆశీస్సులు ఎప్పుడూ నీకు ఉండాలి. ‘డెకాయిట్’ టీమ్కు, అడివి శేష్, మృణాల్ ఠాకూర్లకు నా అభినందనలు” అంటూ సమంత తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పేర్కొంది.ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ముఖ్యంగా అక్కినేని కుటుంబానికి చెందిన ప్రాజెక్ట్కు సమంత శుభాకాంక్షలు తెలపడం నెటిజన్లలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. గతంలో నాగచైతన్యతో వివాహ బంధంలో ఉన్న సమంత, తర్వాత విడిపోయిన విషయం తెలిసిందే. అయినప్పటికీ ప్రొఫెషనల్గా ఇలా స్పందించడం ప్రశంసలు అందుకుంటోంది.
ఇక సినిమా విషయానికొస్తే, ‘డెకాయిట్’ ఒక రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో అనురాగ్ కశ్యప్, ప్రకాష్ రాజ్, సునీల్, అతుల్ కులకర్ణి తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పిస్తుండగా, యస్.యస్ క్రియేషన్స్ బ్యానర్పై సుప్రియ యార్లగడ్డ నిర్మిస్తున్నారు. సంగీతాన్ని భీమ్స్ సిసిరోలియో అందించగా, బ్యాక్గ్రౌండ్ స్కోర్ను గ్యానీ కంపోజ్ చేస్తున్నారు. కథ, స్క్రీన్ప్లేలో అడివి శేష్ కూడా భాగస్వామ్యం కావడం విశేషం.