Regina Cassandra | కోలీవుడ్ స్టార్ హీరోయిన్ నయనతార నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రాల్లో ‘మూకుతి అమ్మన్ 2’ ఒకటి. 2020లో విడుదలై మంచి విజయాన్ని అందుకున్న దైవభక్తి, ఫాంటసీ అంశాలతో తెరకెక్కిన ‘మూకుతి అమ్మన్’ సినిమాకు ఇది సీక్వెల్ కావడంతో ఈ ప్రాజెక్ట్పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. తొలి భాగానికి ఆర్జే బాలాజీ దర్శకత్వం వహించగా, రెండో భాగాన్ని ప్రముఖ నటుడు, దర్శకుడు సుందర్ సి తెరకెక్కిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం.. ఈ భారీ చిత్రంలో ప్రముఖ నటి రెజీనా కసాండ్రా కీలక పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు, ఆమె ఈ సినిమాలో ప్రతినాయక పాత్రలో కనిపించబోతున్నట్లు కోలీవుడ్ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది.
ఈ పాత్ర కోసం దర్శకుడు సుందర్ సి ప్రత్యేకంగా ఓ శక్తివంతమైన క్యారెక్టర్ను డిజైన్ చేసినట్లు సమాచారం. రెజీనాను ఇప్పటివరకు ప్రేక్షకులు చూడని విధంగా, సరికొత్త లుక్లో ఈ సినిమాలో చూపించనున్నారట. నయనతారకు దీటుగా సాగే ఈ పాత్ర కథలో అత్యంత కీలకంగా ఉండబోతుందని టాక్. దీంతో ‘మూకుతి అమ్మన్ 2’లో నయనతార వర్సెస్ రెజీనా పోరాటం ఎలా ఉండబోతుందనే ఆసక్తి అభిమానుల్లో పెరిగింది. ఈ సినిమాను ప్రముఖ తమిళ నిర్మాత డాక్టర్ ఇషారి కె. గణేష్ తన వెల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ బ్యానర్పై నిర్మిస్తున్నారు. ‘మూకుతి అమ్మన్ 2’ను రూ.100 కోట్లకు పైగా భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. తొలి భాగంతో పోలిస్తే రెండో భాగంలో విజువల్ ఎఫెక్ట్స్, ఫాంటసీ అంశాలు, యాక్షన్ సన్నివేశాలను మరింత భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది.
సుందర్ సి ఇప్పటికే ‘అరణ్మనై’ హారర్-కామెడీ ఫ్రాంచైజ్తో భారీ విజయాలు అందుకున్నారు. ఫాంటసీ, హారర్, కామెడీ, విజువల్ ఎలిమెంట్స్ను ప్రేక్షకులకు నచ్చేలా తెరకెక్కించడంలో ఆయనకు మంచి అనుభవం ఉంది. ఇప్పుడు ‘మూకుతి అమ్మన్ 2’ను కూడా అదే స్థాయిలో భారీ కమర్షియల్ ఎంటర్టైనర్గా రూపొందిస్తున్నారని సమాచారం. ఈ సినిమాకు సంబంధించిన మరో ఆసక్తికర విషయం ఏమిటంటే.. థియేట్రికల్ విడుదల తర్వాత స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ వేదిక జియోహాట్స్టార్ భారీ మొత్తానికి సొంతం చేసుకున్నట్లు సమాచారం. సినిమా ఫుటేజ్ చూసిన తర్వాతే ఈ డీల్ జరిగినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ఓటీటీ ఒప్పందానికి సంబంధించిన ఆర్థిక వివరాలపై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అయినప్పటికీ, సినిమా విడుదలకు ముందే డిజిటల్ హక్కులకు ఇంతటి క్రేజ్ రావడం ‘మూకుతి అమ్మన్ 2’పై ఉన్న అంచనాలకు నిదర్శనంగా భావిస్తున్నారు.