‘మీలో ఒకడిగా ఈ సినిమాను ఎంజాయ్ చేశా. నాకు నచ్చింది కాబట్టి తప్పకుండా మీ అందరికి నచ్చుంతుందని భావిస్తున్నా. నేను అదృష్టం, జాతకం కంటే కష్టాన్ని నమ్ముకుంటా’ అన్నారు రవితేజ. ఆయన కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ‘ఖిలాడి’. రమేష్వర్మ దర్శకుడు. కోనేరు సత్యనారాయణ నిర్మాత. నేడు ప్రేక్షకులముందుకు రానుంది. బుధవారం ప్రీరిలీజ్ వేడుకను నిర్వహించారు. నిర్మాత మాట్లాడుతూ ‘ఈ టైటిల్ రవితేజకు పక్కా సరిపోయింది. ఇది పాన్ఇండియా మూవీ. బాలీవుడ్లో కూడా విడుదల చేస్తున్నాం. దేవిశ్రీప్రసాద్ సంగీతం సినిమాకు ప్రధానాకర్షణగా నిలిచింది. వందరూపాయల టికెట్ కొంటే ఐదొందల రూపాయల విలువను ప్రేక్షకులకు అందించే చిత్రమిది. ఈ సినిమా తీసినందుకు నిర్మాతగా గర్వపడుతున్నా’ అన్నారు. ‘కథలో కొత్తదనం ఉంది కాబట్టే రవితేజ సినిమాకు ఒప్పుకున్నారు. దేవిశ్రీప్రసాద్కు ఈ కథ చెప్పినప్పుడు కొన్ని సలహాలిచ్చారు. అన్ని విభాగాల్లో సినిమా అద్భుతంగా కుదిరింది’ అని దర్శకుడు తెలిపారు. దర్శకుడు కథ చెప్పినప్పుడే కొన్ని బాణీలు అనుకోకుండా వచ్చేశాయని, సినిమా హాలీవుడ్ స్థాయిలో ఉంటుందని సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులందరు పాల్గొన్నారు.