ప్రేమ, పెళ్లి విషయాల్లో అందాల నాయికలు దాటవేసే ధోరణిని అనుసరిస్తుంటారు. పెళ్లెప్పుడనే ప్రశ్న అడగ్గానే అందుకు చాలా సమయం ఉందని సమాధానం చెప్పి తప్పించుకుంటారు. ఢిల్లీ ముద్దుగుమ్మ రాశీఖన్నా మాత్రం మనసుకు నచ్చిన వాడు తారసపడితే ఆలస్యం చేయకుండా వెంటనే పెళ్లిచేసుకుంటానని అంటోంది. కాబోయే జీవితభాగస్వామి విషయంలో తనకు పెద్ద కోరికలు లేవని తెలిపింది. రాశీఖన్నా మాట్లాడుతూ ‘నాకు ధైవభక్తి ఎక్కువ. నేను పెళ్లిచేసుకోబోయేవాడు దేవుడిని విశ్వసించాలి. అతడిలో ఆధ్యాత్మిక చింతన ఎక్కువగా ఉండాలి. నేటి ఆధునిక యుగంలో అలాంటి లక్షణాలున్న జీవితభాగస్వామి దొరకడం కష్టమే. నచ్చిన వాడు ఎక్కడున్నా వెతికిపట్టుకొని పెళ్లిచేసుకుంటా’ అనితెలిపింది.