విలువిద్య నేపథ్యంలో ఇండియన్ స్క్రీన్పై రూపొందిన తొలి సినిమా ఇదేనని అన్నారు పుస్కూర్ రామ్మోహన్రావు. నారాయణ్దాస్ కె నారంగ్, శరత్మరార్లతో కలిసి ఆయన నిర్మించిన చిత్రం ‘లక్ష్య’. నాగశౌర్య, కేతికశర్మ జంటగా నటించారు. సంతోష్జాగర్లపూడి దర్శకుడు. ఈ నెల 10న రిలీజ్కానుంది. ఈ సందర్భంగా బుధవారం హైదరాబాద్లో నిర్మాతలు మాట్లాడుతూ ‘కొవిడ్ కారణంగా ప్రేక్షకులు థియేటర్స్కు వస్తారా?లేదా అనే భయాలతో ‘లవ్స్టోరి’ సినిమాను విడుదలచేశాం. ఆ భయాలను పటాపంచలు చేస్తూ సినిమా పెద్ద విజయాన్ని సాధించింది. మా బ్యానర్ ప్రతిష్టను మరో మెట్టు ఎక్కించింది. ఆ విజయపరంపరను ‘లక్ష్య’ కొనసాగిస్తుందనే నమ్మకముంది క్రీడానేపథ్యంతో పాటు అన్ని రకాల భావోద్వేగాల కలబోతగా ఉంటుంది. ఆర్చరీ క్రీడలో విజేతగా నిలిచే క్రమంలో ఓ ఆటగాడికి ఎలాంటి అడ్డంకులు ఎదురయ్యాయి?వాటిని ఏ విధంగా అధిగమించాడనే అంశాన్ని దర్శకుడు సంతోష్ జాగర్లపూడి ఆసక్తికరంగా తీర్చిదిద్దారు. ఆర్చరీ ప్లేయర్గా నాగశౌర్య పాత్ర నాలుగు భిన్న కోణాల్లో సాగుతుంది. తెలంగాణలో థియేటర్స్, టికెట్ రేట్స్ పరంగా ఎలాంటి ఇబ్బందులు లేవు. దేశంలోనే అత్యాధునిక హంగులతో కూడిన థియేటర్స్ తెలంగాణలోనే ఉన్నాయి. ఏపీలో టికెట్ రేట్స్ విషయంలో ఉన్న సమస్యల్ని పరిష్కరించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం మా భాగస్వామ్యంలో ధనుష్-శేఖర్కమ్ముల కలయికలో ఓ సినిమా చేయబోతున్నాం. శివకార్తికేయన్ చిత్రంతో పాటు సందీప్కిషన్, విజయ్ సేతుపతితో మరో సినిమా నిర్మించబోతున్నాం. సుధీర్బాబుతో ఓ సినిమా ఉంటుంది. నాగార్జునతో తెరకెక్కిస్తున్న ‘ది ఘోస్ట్’ చిత్రీకరణ సాగుతోంది. కుటుంబభాధ్యతల కారణంగా కాజల్ ఈ సినిమా నుంచి తప్పుకొన్నది. ఆమె స్థానంలో మరో హీరోయిన్ను త్వరలో ఎంపికచేస్తాం’ అని తెలిపారు.