కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించిన ‘దేవర’ చిత్రం 2024లో విడుదలై 500కోట్ల భారీ విజయాన్ని దక్కించుకున్నది. సినిమా ఎండింగ్లో దీనికి సీక్వెల్ ఉన్నట్లు దర్శకుడు ప్రకటించారు. సినిమా విడుదలై ఏడాదిన్నర దాటింది. ఇప్పటివరకూ ‘దేవర 2’ విషయంలో చడీచప్పుడు లేదు. దేవరను తన కొడుకే ఎందుకు పొడిచాడు? అనే ప్రశ్న అభిమానుల్లోనూ, సగటు ప్రేక్షకుడిలోనూ ఇప్పటికీ అలాగే ఉంది. ఈ ప్రశ్నకు సమాధానం తెలియాలంటే ‘దేవర 2’ మొదలవ్వాలి.
అదెప్పుడు? అని అంతా ఎదురు చూస్తున్న తరుణంలో చిత్ర నిర్మాతల్లో ఒకరైన మిక్కిలినేని సుధాకర్ ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ను ప్రకటించారు. ఈ ఏడాది మే నెలలో ‘దేవర 2’ పనులు మొదలుకానున్నాయని, వచ్చే ఏడాది సినిమాను విడుదల చేస్తామని ఆయన తెలిపారు. తొలిభాగం కంటే ఈ రెండో భాగం చాలా పవర్ఫుల్గా ఉంటుందని, పార్ట్ -1లో చూసింది పది శాతమే అనీ, రెండోభాగంలో వందశాతం చూస్తారని దర్శకుడు కొరటాల శివ చెబుతున్నారు. ఈ అప్డేట్ తారక్ అభిమానులకు గొప్ప శుభవార్తే అని చెప్పాలి.