అప్పటి వరకు టాలీవుడ్లో భారీ బడ్జెట్తో సినిమాలు చేయాలి అంటే నిర్మాతలకు గుండెల్లో దఢ మొదలయ్యేది. మన సినిమాలను ఇతర భాషలకు చెందిన ప్రేక్షకులు ఆదరిస్తారా అనే భయం దర్శకులలో ఉండేది.కాని వాటన్నింటిని తుడిచి పెట్టి చరిత్ర సృష్టించిన చిత్రం బాహుబలి. పీరియాడికల్ చిత్రంగా రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి చిత్రం బాక్సాఫీస్ ని షేక్ చేసి అనేక రికార్డులు సాధించింది.
రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా ముఖ్యపాత్రల్లో నటించిన బాహుబలి చిత్రం ఇండియన్ సినిమాగా టర్న్ తీసుకొని అందరి ప్రశంసలు అందుకుంది. క్లైమాక్స్లో కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనే విషయాన్ని సస్పెన్స్లో పెట్టి దీని గురించి దేశమంతా చర్చించుకునేలా చేశాడు జక్కన్న. డిజిటల్ యుగంలో మన దేశంలోనే ఎక్కువ మంది ప్రేక్షకులు చూసిన చిత్రంగా బాహుబలి సినిమాలు రికార్డులకు ఎక్కాయి. మొత్తంగా మాములు మహా భారత కథను పోలిన బాహుబలి సిరీస్ అనేది ఇండియన్ సినిమాలో ఒక ఎపిక్గా మిగిలిపోయింది.
బాహుబలి సిరీస్లో మొదటి సినిమా బాహుబలి బిగినింగ్ విడుదలై నేటికి 6 యేళ్లు పూర్తి చేసుకుంది.ఈ సందర్భంగా ప్రభాస్ శివుడి పాత్రకు సంబంధించిన ఫొటోని షేర్ చేస్తూ.. బాహుబలి టీం దేశ వ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు పుట్టించింది అంటూ చిత్ర బృందానికి సంబంధించిన ప్రముఖులను ట్యాగ్ చేశాడు. దేశ వ్యాప్తంగా ఉన్న స్టార్ హీరోల కలెక్షన్లను వెనక్కి నెట్టి నెంబర్ వన్ స్టానంలో నిలిచింది బాహుబలి సిరీస్. రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కిన ‘బాహుబలి’ సినిమా తొలి రూ. 100 కోట్ల షేర్ సాధించిన చిత్రంగా రికార్డులకు ఎక్కింది.