Pooja Hegde | అగ్ర కథానాయిక పూజాహెగ్డేకు గత రెండేళ్లుగా అంతగా కలిసి రావడం లేదు. తెలుగులో ‘అల వైకుంఠపురములో’ తర్వాత ఒక్క విజయాన్ని దక్కించుకోలేకపోయింది. కెరీర్ వరుస వైఫల్యాలతో కొనసాగుతున్నా ఏ మాత్రం ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా తిరిగి పూర్వ వైభవాన్ని సాధిస్తాననే ధీమాతో ఉంది పూజాహెగ్డే. తాజా సమాచారం ప్రకారం ఈ భామ రెండు భారీ ప్రాజెక్ట్లలో భాగం కానున్నట్లు తెలిసింది. ‘పుష్ప-2’ చిత్రం తర్వాత అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ ఓ సినిమా చేయబోతున్నారని వార్తలొస్తున్నాయి. బన్నీకి కథ చెప్పానని, ఇద్దరి మధ్య చర్చలు జరుగుతున్నాయని అట్లీ ఓ సందర్భంలో తెలిపారు. ఈ సినిమాలో పూజాహెగ్డే కథానాయికగా నటించనుందని తమిళ మీడియాలో వార్తలొస్తున్నాయి.
ఇక మరో సినిమా విషయానికొస్తే… నందినీ రెడ్డి దర్శకత్వంలో సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా ఓ సినిమా తెరకెక్కనుంది. తొలుత ఇందులో సమంతను నాయికగా అనుకున్నారట. అయితే ప్రస్తుతం ఆమె సినిమాలకు బ్రేక్ తీసుకోవడంతో ఆమె స్థానంలో పూజాహెగ్డేను కథానాయికగా ఎంపిక చేసే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఒకవేళ ఈ రెండు సినిమాల్లో పూజాహెగ్డే నాయికగా ఖరారైతే కెరీర్ తిరిగి పుంజుకుంటుందని ఆమె అభిమానులు ఆశిస్తున్నారు.