‘సినిమాలో కనిపించే కాస్ట్యూమ్తో ఈ రోజు వచ్చానంటే మీకోసం. ఈ సినిమాను ఇంత ప్రేమిస్తారని అనుకోలేదు. ఒక సినిమాకోసం ఇంతమంది ఎదురు చూడటం ‘ఓజీ’కే చూశా. ఈ రోజు నేను డిప్యూటీ సీఎం అని మర్చిపోయా. సినిమాలు వదిలేసి పాలిటిక్స్లోకి వెళ్లినా మీరు నన్ను వదల్లేదు. ఈ రోజు ప్రజలకోసం కొట్లాడుతున్నానంటే మీరిచ్చిన బలం.’ అని పవన్కల్యాణ్ అన్నారు. ఆయన కథానాయకుడిగా రూపొందిన పాన్ ఇండియా యాక్షన్ అడ్వెంచర్ ‘ఓజీ’. ప్రియాంక అరుళ్ మోహన్ కథానాయిక. సుజిత్ దర్శకుడు. డీవీవీ దానయ్య నిర్మాత. ఈ నెల 25న సినిమా విడుదల కానుంది.
ఈ సందర్భంగా లక్షలాది అభిమానుల సాక్షిగా హైదరాబాద్లో నిర్వహించిన సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్లో పవన్కల్యాణ్ మాట్లాడారు. ఇంకా చెబుతూ ‘ఇమ్రాన్ హష్మీతో కలిసి పని చేయడం చాలా ఆనందంగా ఉంది. దర్శకుడు సుజిత్ని త్రివిక్రమ్ పరిచయం చేశారు. తను నా అభిమాని. ‘జానీ’ సినిమా చూసి ఆ హెడ్ బ్యాండ్ నెలరోజులు కట్టుకొని తిరిగాడట. ఈ సినిమాకు నిజమైన పిల్లర్స్ ఇద్దరు. ఫస్ట్ పిల్లర్ సుజిత్. అద్భుతంగా సినిమా తీశాడు. అతని టీమ్ అంతా బ్రిలియంట్ యంగ్స్టర్స్. ఇలాంటి టీమ్ నాకుంటే బహుశా పాలిటిక్స్లోకి వచ్చేవాడ్ని కాదేమో. సుజిత్ తాలూకు డ్రీమ్ని రియలైజ్ చేసిన తమన్ ఈ సినిమాకు రెండో పిల్లర్. అతని మ్యూజిక్కే ఈ సినిమాకు వెన్నెముక.
ఇద్దరూ ఈ సినిమాకోసం ప్రాణం పెట్టేశారు. డీవోపీలు రవి కె. చంద్రన్, మనోజ్ పరమహంస క్లాసిక్ విజువల్స్ అందించారు. ఇక ప్రియాంక అరుళ్ మోహన్. కథానుగుణంగా అచ్చం 80ల్లో ఉండే అమ్మాయిలాగే బిహేవ్ చేశారు. ఓజస్ గంభీర, కణ్మనిల అనుబంధం సినిమాలో తక్కువ సేపు ఉన్నా.. హృద్యంగా ఉంటుంది. అంత చక్కని లవ్స్టోరీ తీశారు సుజిత్. అభిమాన నటుడ్ని అభిమాని డైరెక్ట్ చేస్తే ఎలా ఉంటుందో ‘ఓజీ’లో చూస్తారు.’ అని పేర్కొన్నారు పవన్కల్యాణ్. చిత్రబృందంతోపాటు అల్లు అరవింద్, దిల్రాజు, వై.రవిశంకర్, కోన వెంకట్ తదితరులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.