ఖైరతాబాద్, ఏప్రిల్ 9 : రేషన్ డీలర్ల కష్ట సుఖాల్లో పాలుపంచుకుంటూ రేషన్ డీలర్లకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తానని అఖిల తెలంగాణ రేషన్ డీలర్ల సమాఖ్య నూతన అధ్యక్షుడు దొమ్మాటి రవీందర్ అన్నారు. అఖిల తెలంగాణ రేషన్ డీలర్ల సమాఖ్య ఆవిర్భావోత్సవం శుక్రవారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో జరిగింది. తొలుత కరోనా కారణంగా మృతిచెందిన రేషన్ డీలర్ల ఆత్మకు శాంతి కలుగాలని కోరుతూ మౌనం పాటించి సంతాపం ప్రకటించారు. అనంతరం రాష్ట్రంలోని 33జిల్లాలకు చెందిన ప్రతినిధులు సమాఖ్య అధ్యక్షుడిగా రవీందర్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా రవీందర్ మాట్లాడుతూ రేషన్ డీలర్లకు గౌరవ వేతనం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతామని తెలిపారు. డీలర్ల సమస్యలను డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్, తెలంగాణ సివిల్ సైప్లెస్ కార్పొరేషన్ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి ద్వారా సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తామన్నారు. త్వరలోనే రేషన్ డీలర్లకు రూ.58 కోట్లను విడుదల చేయడంతో పాటు గన్నీ సంచి ధర రూ.18 నుంచి రూ.22కు పెంచుతామని కార్పొరేషన్ చైర్మన్ హామీ ఇచ్చారని తెలిపారు. 15 తర్వాత అన్ని జిల్లాల్లో పర్యటించి పూర్తి స్థాయి కార్యవర్గాన్ని ఎన్నుకుంటామని ప్రకటించారు. అనంతరం కార్పొరేషన్ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో వివిధ జిల్లాల ప్రతినిధులు సురేందర్, సనా పటేల్, అజీజ్, పద్మ, గీత, ఓంప్రకాశ్, దీప్ల నాయక్ తదితరులు ఉన్నారు.