కేవలం గ్లామర్ తళుకులతో నేడు చిత్రసీమలో రాణించడం కష్టమనే వాస్తవాన్ని తెలుసుకుంటున్నారు మనకథానాయికలు…రేసులో నిలదొక్కుకోవాలంటే అభినయప్రధాన పాత్రల్ని ఎంచుకొని సత్తా చాటాలనే ప్రయత్నాలు చేస్తున్నారు.డిజిటల్ వేదికల ప్రభావం పెరగడం..పాన్ ఇండియన్ సినిమాల రూపకల్పన అధికం కావడంతో ఇప్పుడు గ్లామర్ హంగుల కంటే ప్రతిభకు పెద్దపీట వేసే ధోరణి ఎక్కువైంది. దీంతో అగ్రకథానాయికలు మొదలుకొని వర్ధమాన తారల వరకు పాత్రల ఎంపికలో వైవిధ్యానికి ప్రాధాన్యతనిస్తున్నారు. సవాళ్లతో కూడిన పాత్రల్ని ఎంచుకుంటూ తమ ప్రతిభను చాటాలని ఉవ్విళ్లూరుతున్నారు.
అభినయం కంటే అందచందాలతోనే అగ్రకథానాయికల్లో ఒకరిగా పేరుతెచ్చుకున్నది పంజాబీ సొగసరి రకుల్ప్రీత్సింగ్. పలు తెలుగు చిత్రాల్లో గ్లామర్ తళుకులతో ప్రేక్షకుల్ని అలరించింది. కొంతకాలంగా కథాంశాలు, పాత్రల పరంగా తన శైలిని మార్చుకున్న ఆమె లేడీ ఓరియెంటెడ్ సినిమాలపైఆసక్తిని చూపుతోంది. ఇటీవలే తెలుగులో ఓ మహిళా ప్రధాన చిత్రానికి ఆమె గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ఏ.ఎల్ విజయ్ దర్శకత్వంలో ‘అక్టోబర్ 31 లేడీస్నైట్’ పేరుతో హారర్ థ్రిల్లర్ చిత్రం తెరకెక్కుతోంది. మంజిమామోహన్, నివేథా పేతురాజ్, మేఘాఆకాష్ ఈ సినిమాలో కీలక పాత్రల్ని పోషిస్తున్నారు. ప్రధాన నాయికగా రకుల్ప్రీత్సింగ్ నటిస్తోంది. హలోవీన్ పార్టీ నేపథ్యంలో ఒక రోజు రాత్రిలో జరిగే కథ ఇదని సమాచారం. రకుల్ప్రీత్సింగ్ పాత్ర గత చిత్రాలకు పూర్తి భిన్నంగా సరికొత్తగా ఉంటుందని చిత్రబృందం చెబుతోంది.
కుటుంబ, ప్రేమకథా చిత్రాలతో దక్షిణాది ప్రేక్షకుల ఆరాధ్యనాయికగా పేరుతెచ్చుకున్నది కాజల్ అగర్వాల్. పెళ్లి తర్వాత సినిమాల ఎంపికలో ఆమె పంథాలో మార్పులు కనిపిస్తున్నాయి. వాణిజ్య కథలతో పోలిస్తే మహిళా ప్రధాన చిత్రాలకే ఎక్కువగా ప్రాముఖ్యతనిస్తోంది. హిందీలో ‘ఉమ’ పేరుతో ఓ సినిమా చేస్తోంది. ఫాంటసీ డ్రామా కథాంశంతో పెళ్లి నేపథ్యంలో సెంటిమెంట్ ప్రధానంగా ఈ సినిమా సాగనుంది. అపరిచితురాలైన అమ్మాయి రాకతో ఆ పెళ్లి వేడుకలో చోటుచేసుకున్న సంఘటనలతో దర్శకుడు తథాగథ సింఘా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. కోల్కతాలో ఈ సినిమా చిత్రీకరణ జరుగుతోంది. అలాగే తమిళంలో ‘కరుంగాపియమ్’ అనే హారర్ సినిమాను అంగీకరించింది. లేడీ ఓరియెంటెడ్ కథాంశంతో సాగే ఈ సినిమాలో 1940ల కాలం నాటి జమీందారిణిగా కాజల్ కనిపించబోతున్నది.
‘దేశముదురు’. ‘కందిరీగ’, ‘పవర్’తో పాటు పలు తెలుగు చిత్రాల్లో గ్లామర్ పాత్రలతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నది ముంబయి ముద్దుగుమ్మ హన్సిక. పద్నాలుగేళ్ల సినీ ప్రయాణంలో కమర్షియల్ సినిమాల్లోనే ఎక్కువగా నటించిన హన్సిక కొన్నాళ్లుగా తన ఆలోచన విధానాన్ని మార్చుకుంది. మహిళా ప్రధాన ఇతివృత్తాలు, ప్రయోగాత్మక పాత్రలపై మొగ్గుచూపుతోంది. ప్రస్తుతం హన్సిక తెలుగులో ‘మై నేమ్ ఈజ్ శృతి’ చిత్రంలో కథానాయికగా నటిస్తోంది . లేడీ ఓరియెంటెండ్ కథాంశంతో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో శృతి అనే ఆధునిక భావాలున్న యువతిగా నటనకు ఆస్కారమున్న పాత్రలో హన్సిక కనిపించబోతున్నది. ఈ సినిమాతో పాటు ‘105 మినిట్స్’ పేరుతో ఓ ప్రయోగాత్మక చిత్రాన్ని అంగీకరించింది. ఏక పాత్రతో సింగిల్షాట్తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. తమిళ చిత్రం ‘మహా’లో ద్విపాత్రాభినయం చేస్తోంది. నటిగా తనను కొత్త కోణంలో ఆవిష్కరించే సినిమాలు ఇవని హన్సిక చెబుతోంది.
జయాపజయాలకు అతీతంగా తెలుగులో చక్కటి అవకాశాల్ని అందుకుంటోంది అదాశర్మ. అందంతో పాటు చక్కటి అభినయంతో అలరిస్తోంది. ‘క్షణం’ తర్వాత రాశి కంటే వాసికే ప్రాముఖ్యతనిస్తోన్న ఆమె వైవిధ్యత కలబోసిన సినిమాల్ని అంగీకరిస్తోంది. ప్రస్తుతం ఆమె తెలుగులో లేడీ ఓరియెంటెండ్ కథాంశాలతో ‘క్వశ్చన్మార్క్’, ‘మీట్ క్యూట్’ సినిమాలు చేస్తోంది. తన జీవితంలో ఎదురైన ప్రశ్నలకు సమాధానాల్ని అన్వేషిస్తూ ప్రయాణాన్ని సాగించే భిన్న ఆలోచన విధానం కలిగిన యువతిగా ‘క్వశ్చన్మార్క్’లో తన పాత్ర డిఫెరెంట్గా ఉంటుందని అదాశర్మ చెబుతోంది. హీరో నాని నిర్మిస్తున్న ‘మీట్ క్యూట్’లో అదాశర్మ ఓ నాయికగా కనిపించబోతున్నది. ఐదుగురు మహిళల జీవనయానాన్ని ఆవిష్కరిస్తూ దర్శకురాలు దీప్తి ఘంటా ఈ సినిమాను తెరకెక్కించబోతున్నట్లు తెలిసింది.
ఈ సినిమాలో అదాశర్మతో పాటు కాజల్ అగర్వాల్, ఆకాంక్షసింగ్ హీరోయిన్లుగా నటించనున్నట్లు వార్తలొస్తున్నాయి. ‘కుమారి 21ఎఫ్’, ‘ఎక్కడకు పోతావు చిన్నవాడా’ వంటి చిత్రాలతో బబ్లీ గర్ల్ ఇమేజ్ను సొంతం చేసుకున్న హెభాపటేల్ ప్రస్తుతం లేడీ ఓరియెంటెండ్ కథాంశంతో ఓ సినిమా చేయబోతున్నది. ఇందులో మూగచెవిటి యువతిగా గ్లామర్ హంగులకు దూరంగా వినూత్నరీతిలో ఆమె పాత్ర ఉంటుందని చెబుతున్నారు. వీరితో పాటు మరికొందరు గ్లామర్ హీరోయిన్స్ మహిళా ప్రధాన చిత్రాలపై దృష్టిసారిస్తున్నారు.