హీరో బాలకృష్ణ నటిస్తున్న 107వ చిత్రానికి ‘వీరసింహారెడ్డి’ అనే టైటిల్ను ఖరారు చేశారు. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ కథతో దర్శకుడు గోపీచంద్ మలినేని ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మిస్తున్నారు. శృతి హాసన్ కథానాయిక. దూనియా విజయ్, వరలక్ష్మి శరత్కుమార్ ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. వచ్చే సంక్రాంతికి సినిమాను విడుదల చేయబోతున్నారు. తాజాగా ఈ చిత్ర టైటిల్ అనౌన్స్మెంట్ కార్యక్రమాన్ని ఏపీలోని కర్నూలు జిల్లా కొండారెడ్డి బురుజు దగ్గర నిర్వహించారు. దర్శకుడు గోపీచంద్ మలినేని మాట్లాడుతూ…‘బాలకృష్ణ అభిమానిగా ఈ చిత్రాన్ని రూపొందించాను.
‘సమరసింహారెడ్డి’ సినిమాను మీరు ఎంతగా ఎంజాయ్ చేశారో ఈ చిత్రాన్ని అంతే ఇష్టపడతారు. ఇంకా ఇరవై రోజులు షూటింగ్ మిగిలి ఉంది. వీరసింహారెడ్డి పుట్టింది పులిచర్ల, చదివింది అనంతపురం, రూలింగ్ కర్నూల్ వంటి సంభాషణలు ఆకట్టుకుంటాయి. సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్, థమన్ సంగీతం ప్రత్యేక ఆకర్షణ అవుతాయి’ అన్నారు. నిర్మాత వై. రవిశంకర్ మాట్లాడుతూ….‘మంచి రోజు మంచి ప్రదేశంలో మంచి విషయం చెప్పాలనుకున్నాం. అందుకే కర్నూలులో కొండారెడ్డి బురుజు దగ్గర చిత్ర టైటిల్ ప్రకటిస్తున్నాం. పాటలు, ఫైట్స్, డైలాగ్స్ ఇలా అన్ని కమర్షియల్ హంగులతో సినిమా మిమ్మల్ని మెప్పిస్తుంది’ అన్నారు.