Chiranjeevi | సింగపూర్ స్కూల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ గాయపడిన విషయం తెలిసిందే. ప్రమాదం జరిగిన రోజున చేతులకి, కాళ్లకి గాయాలు కావడంతో పాటు పొగ ఊపిరి తిత్తుల్లోకి చేరడంతో శ్వాస పీల్చుకోవడానికి మార్క్ శంకర్ కాస్త ఇబ్బంది పడ్డాడు. అయితే మార్క్ శంకర్కి జరిగిన ఈ ప్రమాదం గురించి తెలుసుకొని పవన్ కళ్యాణ్తో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా చాలా కంగారు పడ్డారు. పవన్ కళ్యాణ్, మెగాస్టార్ చిరంజీవి దంపతులు హుటాహుటిన సింగపూర్ వెళ్లారు. మార్క్ శంకర్ ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులని అడిగి తెలుసుకున్నారు.
మార్క్ శంకర్ ఊపిరి తిత్తుల్లోకి చేరిన పొగను..బ్రాంకోస్కోప్ ద్వారా బయటకు పంపేసినట్లుగా తెలుస్తుండగా, ప్రస్తుతం మార్క్ శంకర్ క్షేమంగా ఉన్నాడని మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు. మా బిడ్డ మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు. అయితే ఇంకా కోలుకోవాలి. మా కులదైవమైన ఆంజనేయ స్వామి దయతో, కృపతో త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో, మళ్ళీ మామూలుగా ఎప్పటిలానే ఉంటాడు అని చిరంజీవి తన ట్వీట్లో పేర్కొన్నాడు. ఈ విషయం తెలిసాక పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఆ దేవుడి దయ వలన మార్క్ శంకర్ త్వరగానే కోలుకున్నాడని ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇక పవన్ కుమారుడికి ప్రమాదం జరిగిందని తెలిసిన తర్వాత దాదాపుగా అందరూ స్పందించారు. మార్క్ శంకర్ కోలుకోవాలని సినీ, రాజకీయ ప్రముఖులు కూడా ప్రార్థించారు. వైసీపీ అధినేత జగన్, రోజా కూడా.. పవన్ కు ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు. అయితే జనసేన పార్టీ వ్యతిరేకులు కూడా మంచి మనసుతో స్పందించడం చూశాక రాజకీయాల్లో వ్యక్తిగత కక్షలు ఉండకుండా.. ఇలాంటి సుహృద్భావ వాతావరణం ఉంటే ఎంత బాగుంటుందో కదా అనే అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. మరోవైపు పవన్ కళ్యాణ్ కూడా అందరికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలిపారు.