ఇటీవల జరిగిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికలు ఎంత రసవత్తరంగా సాగాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. హోరాహోరీగా సాగిన ఎన్నికలలో మంచు విష్ణు 107 ఓట్ల తేడాతో విజయం సాధించారు.అయితే ఓడిన మరుక్షణమే ప్రకాశ్ రాజ్ రాజీనామా చేశాడు. . ‘మా’ ఎన్నికల్లో తమ ప్యానెల్ నుంచి గెలిచిన 11 మంది కూడా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ”మా’ సంక్షేమం కోసం.. తమ ప్యానెల్ నుంచి గెలిచినవారు అంతా రాజీనామా చేస్తున్నారని స్పష్టం చేశారు.
అయితే ప్రకాశ్ రాజ్ ప్యానెల్ మూకుమ్మడి రాజీనామాలపై తాజాగా మంచు విష్ణు స్పందించారు. మీడియా ద్వారానే రాజీనామా చేస్తారని విన్నామని, వారి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి రాజీనామా లేఖలు రాలేదన్నారు. రాజీనామా లేఖలు వస్తే అప్పుడు ఏం చేయాలన్నది ఆలోచిస్తానని చెప్పారు. మా అధ్యక్షుడు అంటే సాధారణ విషయం కాదని, అది ఓ బాధ్యత… గౌరవ ప్రధమైన హోదా అన్నారు.మెజారిటీ సభ్యులు తమ ప్యానల్ నుంచే గెలిచారని తెలిపారు. కాగా, ‘మా’ నూతన కార్యవర్గంతో కలిసి విష్ణు సోమవారం ఉదయం తిరుమల తిరుపతి శ్రీవెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. విష్ణుతో పాటు శివ బాలాజీ, గౌతం రాజు, కరాటే కళ్యాణి, పూజిత, జయవాణి, మాణిక్, శ్రీనివాసులు ఉన్నారు.