Kota Srinivasa Rao |కొందరు టాలీవుడ్ హీరోలు తాము తీసుకుంటున్న పారితోషికాల వివరాలు బయటకు చెప్పడం సరికాదని అన్నారు సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు. ఇటీవల హైదరాబాద్లో జరిగిన ఎన్టీఆర్ మెమోరియల్ అవార్డుల కార్యక్రమంలో కోట శ్రీనివాసరావుకు అవార్డు అందించారు.
ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ…‘ఎన్టీఆర్, ఏఎన్నార్ లాంటి సీనియర్ నటులు ఏ రోజూ తమ పారితోషికాల వివరాలు బయటకు చెప్పలేదు. కానీ ఇటీవల కొందరు హీరోలు తాము రోజుకు 2 కోట్ల రూపాయలు ఫీజు తీసుకుంటున్నామని, రోజుకు ఆరు కోట్ల రూపాయలు తీసుకుంటున్నామని, 40 రోజులకు ఇంత ఆదాయం సంపాదిస్తున్నామని బహిరంగంగా చెబుతున్నారు. ఇది సరికాదు. సినీ పరిశ్రమలోని చిన్న నటీనటుల సంక్షేమానికి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ పాటుపడాలి. చాలా మంది చిన్న ఆర్టిస్టులు రెండు పూటలా భోజనం చేయలేని పేదరికంలో ఉన్నారు’ అని చెప్పారు.