కరోనా అనంతరం హిందీ చిత్రసీమ తీవ్ర నష్టాల్ని చవిచూసింది. భారీ సినిమాలు కూడా పరాజయం పాలయ్యాయి. అయితే ‘బ్రహ్మాస్త్ర’ అపూర్వ విజయం హిందీ చిత్రసీమకు కొత్త ఉత్సాహాన్నిచ్చింది. ప్రపంచవ్యాప్తంగా 425 కోట్ల వసూళ్లను సాధించిందీ చిత్రం. అయితే ఈ సినిమా విజయాన్ని ఇప్పుడే పూర్తిగా అంచనా వేయలేమని, ముందుగా అనుకున్న ప్రకారం మూడు భాగాలు పూర్తయితేనే లాభాల లెక్క తేలుతుందన్నారు చిత్ర నిర్మాత కరణ్జోహార్. ‘బ్రహ్మాస్త్ర’ మూడుభాగాలకు కలిపి 400కోట్ల బడ్జెట్ను కేటాయించామని, తొలి భాగంతో దాదాపు బడ్జెట్ మొత్తం రికవరీ అయిందని ఆయన పేర్కొన్నారు.
మిగతా రెండు భాగాలు రిలీజైన తర్వాతే సినిమా ఏ స్థాయి విజయం సాధించిందో అంచనాకొస్తామని కరణ్ జోహార్ చెప్పారు. పరిశ్రమలో ఉన్నత స్థానాల్లో ఉన్న కొందరు వ్యక్తులు ‘బ్రహ్మాస్త్ర’ పరాజయం పాలవ్వాలని బలంగా కోరుకున్నారని, అయితే వారికి నిరాశే మిగిలిందని ఆయన చురకలంటించారు. ‘ఏ రంగంలోనైనా సరే నిర్మాణాత్మక విమర్శలు చేయడంలో తప్పులేదు. కానీ కోట్ల బ డ్జెట్, వందల మంది శ్రమతో రూపొందిన సినిమా పరాజయం కావాలని కోరుకోవడం మంచి లక్షణం కాదు. ఏ ఒక్కరి సక్సెస్ల వల్ల పరిశ్రమ వృద్ధిచెందదు. సమిష్టి విజయాలతోనే ఇండస్ట్రీ రాణిస్తుంది’ అని కరణ్జోహార్ పేర్కొన్నారు. రణ్బీర్కపూ ర్, అలియాభట్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘బ్రహ్మాస్త్ర’ గత నెల 9న ప్రేక్షకుల ముందుకొచ్చి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.