నాయికగా స్టార్డమ్ కోసం శ్రమిస్తున్నది జాన్వీ కపూర్. వైవిధ్యమైన చిత్రాల్లో నటిస్తూ తనకంటూ ఓ ప్రత్యేకత తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నది. ఏ లిస్టర్ కాలేకపోతున్నా..ఆ స్థాయికి చేరుకుంటాననే ధీమా ఆమెలో చూస్తుంటాం. జాన్వీ తాజా సినిమా ‘మిలి’ వచ్చే నెల 4న విడుదలకు సిద్ధమవుతున్నది. ఈ సినిమా ప్రచార కార్యక్రమాల సందర్భంగా జాన్వీ తన కెరీర్ విశేషాలతో పాటు వ్యక్తిగత సంగతులూ పంచుకున్నది. తండ్రి బోనీకపూర్తో సిగరెట్ అలవాటు మాన్పించేందుకు తాము (తల్లి శ్రీదేవి, సోదరి ఖుషి) ఎలా ప్రయత్నించిందీ చెప్పింది. జాన్వీ మాట్లాడుతూ…‘ఒక టైమ్లో నాన్న నిర్మాతగా చాలా బిజీగా ఉండేవారు. ‘నో ఎంట్రీ’, ‘వాంటెడ్’ లాంటి చిత్రాలను ఆయన అప్పుడు నిర్మిస్తున్నారు. సిగరెట్ ఎక్కువగా తాగేవారు. నేనూ, చెల్లెలు ఖుషి నాన్న సిగరెట్ ప్యాకెట్లను దొంగతనం చేసేవాళ్లం. నాన్నకు దొరకకుండా దాచేసి కత్తిరించేవాళ్లం. కొన్నిసార్లు సిగరెట్ల మీద టూత్ పేస్ట్ రాసేవాళ్లం. అమ్మ అయితే నాన్నతో సిగరెట్ మాన్పించేందుకు ఎంతో ప్రయత్నించింది. ఆయన ధూమపానం చేస్తే తను మాంసాహారం ముట్టనని చెప్పింది. వైద్యులు మాత్రం అమ్మ నీరసంగా ఉందని, నాన్ వెజ్ తినాలని చెప్పేవారు. చివరకు నాన్న సిగరెట్ తాగడం మానేశారు’ అని చెప్పింది.