నాని, కీర్తి సురేష్ జంటగా నటించిన సినిమా ‘దసరా’. సింగరేణి ప్రాంతమైన గోదావరిఖని దగ్గర్లోని ఓ గ్రామం నేపథ్య కథతో దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఈ చిత్రాన్ని రూపొందించారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మించారు. పాన్ ఇండియా చిత్రంగా నేడు తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళంలో విడుదలవుతున్నది. ఈ సందర్భంగా చిత్ర విశేషాలను తాజా ఇంటర్వ్యూలో వెల్లడించారు దర్శకుడు శ్రీకాంత్ ఓదెల.
‘జగడం’ స్ఫూర్తితో
మాది పెద్దపల్లి. నాన్న సింగరేణి ఉద్యోగి. సింగరేణి క్వాటర్స్లో నివసించేవాళ్లం. పదో తరగతిలో ఉన్నప్పుడు సుకుమార్ దర్శకత్వం వహించిన ‘జగడం’ సినిమా చూశాను. ఆ చిత్రంతో ఫిలిం మేకింగ్పై ఆసక్తి పెరిగింది. నేను చేసిన లఘు చిత్రం నచ్చి ‘నాన్నకు ప్రేమతో’ సినిమాకు సహాయ దర్శకుడిగా పెట్టుకున్నారు సుకుమార్. ‘రంగస్థలం’ వరకు ఆయనతో పనిచేశాను. ఆ తర్వాత బయటకు వచ్చి ఈ కథ సిద్ధం చేయడం ప్రారంభించా.
నేను చూసిన కథే ‘దసరా’
చిన్నప్పుడు సెలవుల్లో నాన్నమ్మ ఊరు వీర్లపల్లి వెళ్లేవాడిని. ఆ ఊరి ప్రభావం నాపై చాలా ఉంది. నేను నిజ జీవితంలో చూసిన కొన్ని ఘటనల ఆధారంగా ఈ చిత్ర కథను సిద్ధం చేసుకున్నాను. నిర్మాత సుధాకర్ చెరుకూరి ద్వారా నానిని కలిసి 2018 దసరా రోజున ఈ కథ చెప్పాను. టైటిల్ కూడా అప్పుడే నిర్ణయించాం. ఇది పాన్ ఇండియాకు వెళ్తుందనే ఒత్తిడి లేదు. అన్ని భాషల వారికి మంచి సినిమా ఇవ్వాలనే ప్రయత్నం నిజాయితీగా చేశాను. కొంతమంది ఈ సినిమాను ‘పుష్ప’తో పోలుస్తున్నారు. ఆ సినిమాతో ఎలాంటి పోలిక ఉండదు. ఈ సినిమాకు నాని లుక్ నిర్ణయించుకునే సమయానికి ‘పుష్ప’ ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ కాలేదు.
వెన్నెలగా కీర్తి అలరిస్తుంది
తెలంగాణ యాసలో నటించాలి కాబట్టి వెన్నెల పాత్ర కోసం తెలుగు అమ్మాయిని వెతికాం. ఆ పాత్రకు తగిన నాయిక దొరకలేదు. తెలంగాణ యాసలో ఆమె నటన అందరినీ అలరిస్తుంది. సంతోష్ నారాయణ్ సంగీతం, సత్యన్ కెమెరా పనితనం ఆకట్టుకుంటుంది. నా దగ్గర మరికొన్ని కథలు సిద్ధంగా ఉన్నాయి అయితే ప్రస్తుతం దృష్టి ఈ సినిమా పైనే ఉంది.