సినిమాల ఎంపికలో సెలెక్టివ్గా ఉంటుంది అగ్ర కథానాయిక శ్రద్ధాకపూర్. వైవిధ్యమైన కథాంశాలను ఎంచుకుంటూ పాత్రల పరంగా కొత్తదనానికి అధిక ప్రాధాన్యతనిస్తుంది. ప్రస్తుతం ఆమె మహారాష్ట్ర నృత్య కళాకారిణి విఠాబాయి బయోపిక్ ‘ఈతా’లో నటిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ భామ హిందీలో మరో భారీ ప్రాజెక్ట్ను అంగీకరించింది.
అమీర్ఖాన్ హీరోగా నటించే ఈ చిత్రాన్ని భారత్ పే మనీ రూపకర్త అశ్నీర్ గ్రోవర్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కించబోతున్నారు. విశేషమేమిటంటే.. శ్రద్ధాకపూర్ ప్రియుడిగా ప్రచారంలో ఉన్న ప్రముఖ దర్శకుడు, రచయిత రాహుల్ మోడీ ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు.
ఈ చిత్రానికి దర్శకత్వంతో పాటు నిర్మాణ బాధ్యతల్ని కూడా రాహుల్ మోడీ తీసుకున్నారు. శ్రద్ధాకపూర్ కథానాయికగా నటించిన ‘తూ ఝూతీ మే మక్కర్’ చిత్రానికి రాహుల్ మోడీ రచయితగా పనిచేశారు. ఆ సినిమా షూటింగ్ సమయంలో ఏర్పడిన పరిచయం క్రమంగా ప్రేమగా మారిందని తెలిసింది. గత రెండేళ్లుగా రాహుల్ మోడీతో శ్రద్ధాకపూర్ ప్రేమలో ఉందని బాలీవుడ్ టాక్. ప్రియుడి దర్శకత్వంలో సినిమా కావడంతో శ్రద్ధాకపూర్ ఈ సినిమాకు వెంటనే అంగీకరించిందని సమాచారం. త్వరలో ఈ చిత్రం సెట్స్మీదకు వెళ్లనుంది.