రామ్చరణ్ ‘గేమ్ఛేంజర్’ వైజాగ్ షెడ్యూల్ నిన్నటితో పూర్తయినట్టు విశ్వసనీయ సమాచారం. తదుపరి షెడ్యూల్ ఎప్పుడన్నది త్వరలో ప్రకటించనున్నారు దర్శకుడు శంకర్. ఇదిలావుంటే.. బుధవారం హైదరాబాద్లోని ఓ ప్రముఖ స్టార్ హోటల్లో రామ్చరణ్, బిచ్చిబాబు సానా కాంబినేషన్లో రూపొందనున్న సినిమాకు సంబంధించిన పూజాకార్యక్రమం లాంఛనంగా జరుగనుందని తెలుస్తున్నది.
వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకటసతీశ్ కిలారు నిర్మించనున్న ఈ సినిమాకు మైత్రీమూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు భాగస్వాములుగా వ్యవహరిస్తున్నారు. జాన్వీ కపూర్ కథానాయిక. విజయ్సేతుపతి విలన్గా నటిస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే ఈ సినిమా ప్రీప్రొడక్షన్ వర్క్ మొత్తం దర్శకుడు బుచ్చిబాబు పూర్తి చేశారు. ఉత్తరాంధ్రకు చెందిన నటీనటుల కోసం ఆడిషన్స్ కూడా నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే.. ‘గేమ్ఛేంజర్’ షూటింగ్ పూర్తి అయిన తర్వాతే ఈ సినిమా షూటింగ్ మొదలవుతుందని తెలుస్తున్నది. ‘పెద్ది’ అనే టైటిల్ని ఈ సినిమాకు ఖరారు చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.