గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో సింగరేణి ప్రాంతానికి చెందిన ఆరేళ్ళ చిన్నారి హత్యాచార కేసు ఎంత కలకలం రేపిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అభం శుభం తెలియని చిన్నారికి మాయమాటలు చెప్పి రాజు అనే కీచకుడు హత్యాచారం చేసిన సంగతి తెలిసిందే. ఈ సంఘటన యావత్ దేశాన్ని నివ్వెరపరచింది. నిందితుడికి తగిన శిక్ష వేయాలని సామాన్యులు, సెలబ్రిటీలు ముక్త కంఠంతో డిమాండ్ చేశారు.
ఉదంతానికి బలైన చిన్నారి కుటుంబానికి అండగా టాలీవుడ్ తారలు కూడా అండగా నిలిచారు. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, నాని, మంచు మనోజ్ వంటి వారు కీచకుడిని కఠినంగా శిక్షించాలని అన్నారు. అయితే ఊహించని విధంగా వరంగల్ జిల్లా ఘన్ పూర్ రైల్వే ట్రాక్ దగ్గర అతడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఒంటి మీద ఉన్న టాటూల ఆధారంగా అతడు రాజు అని పోలీసులు తేల్చారు.
రాజు మృతిపై హర్షం వ్యక్తం అవుతుంది. తాజాగా మెగాస్టార్ చిరంజీవి తన ట్విట్టర్లో అభం శుభం తెలియని ఆరేళ్ల చిన్నారిపై హత్యాచారానికి పాల్పడిన రాజు అనే కిరాతకుడు తనకు తాను శిక్షను విధించుకోవడం బాధిత కుటుంబంతో పాటు మిగతా అందరికి కొంత ఊరట కలిగిస్తుంది. ఈ సంఘటనపై మీడియా, పౌర సమాజం గొప్పగా స్పందించాయి.
ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు ప్రభుత్వంతో పాటు పౌర సమాజ చొరవ చూపాలి.అలాంటి కార్యక్రమాలు ఎవరు చేపట్టినా నా సహకారం ఉంటుంది. చిన్నారి కుటుంబాన్ని ప్రభుత్వం తగిన విధంగా ఆదుకోవాలి అని ఆయన తన ట్వీట్లో పేర్కొన్నారు.