MAA elections | అక్టోబర్ 10న జరగనున్న మా ఎలక్షన్స్కి సంబంధించి ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో జోరుగా చర్చలు నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ సారి అధ్యక్ష బరిలో ప్రకాశ్ రాజ్,మంచు విష్ణు, జీవిత, హేమ, సీవీఎల్ నరసింహరావు, కాదంబరి కిరణ్ ఉండనుండగా, తాజాగా జీవిత, హేమ తనతో జట్టు కట్టినట్టు ప్రకాశ్ రాజ్ పేర్కొన్నారు. దీంతో మంచు విష్ణు, ప్రకాశ్రాజ్ మధ్య ఫైట్ రసవత్తరంగా ఉండనున్నట్టు తెలుస్తుంది.
అయితే మొదటి నుండి ప్రకాశ్ రాజ్కి సపోర్ట్ ఇస్తున్న బండ్ల గణేష్.. తనకు అప్పగించిన బాధ్యతలను నిర్వర్తించలేనంటూ చేతులెత్తేశారు. ఈ మేరకు ప్రకాష్ రాజ్కు బండ్ల గణేష్ ట్వీట్ చేశారు. ‘‘గౌరవనీయులైన ప్రకాష్ రాజ్ గారు, నన్ను అధికార ప్రతినిధిగా ఎంచుకున్నందుకు ధన్యవాదాలు. వ్యక్తిగత కారణాల వల్ల నేను ఆ పదవిని నేను నిర్వర్తించలేను. దానికి న్యాయం చేయలేను. దయచేసి ఆ పదవికి వేరే వ్యక్తిని ఎంచుకోగలరు. మీ టీమ్కు ఆల్ ది బెస్ట్. మీ బండ్ల గణేష్’’ అంటూ బండ్ల గణేష్ ట్వీట్ చేశారు.
బండ్ల గణేష్ ఇలా ఎందుకు ట్వీట్ చేశాడు అనే దానిపై చర్చ ఆసక్తికరంగా నడుస్తుంది. మీడియాతో మాట్లాడిన ప్రకాశ్ రాజ్ తమ ప్యానల్ తరపున ప్రతినిధులుగా జయసుధ, బండ్ల గణేశ్, సాయికుమార్ మాత్రమే మాట్లాడతారని ప్రకటించారు. కాని ప్రకాష్ రాజ్ ప్రకటించిన ప్యానెల్లో ఎక్కడా బండ్ల గణేష్ పేరు లేదు. కనీసం ఈసీ మెంబర్స్ లిస్ట్లో కూడా ఆయన పేరు కనిపించలేదు. దీంతో ఆయన మనస్తాపానికి గురైనట్లు తెలుస్తోంది. మరోవైపు బండ్ల ప్రస్తుతం హీరోగా సినిమా చేస్తున్నాడు.దాని వలన కూడా ఈ నిర్ణయం తీసుకొని ఉండొచ్చని కొందరు భావిస్తున్నారు.