హైదరాబాద్లోని రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో బీహార్కు చెందిన నందులాల్ ప్రాణాలు కోల్పోగా, ఈ ఘటనకు కారణమైన టీటీడీ బోర్డ్ మెంబర్, ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కుమారుడు సందీప్ను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఔటర్ రింగ్ రోడ్డు రోటరీ నుంచి ఖాజాగూడ మెయిన్ రోడ్డు మార్గంలో ఈ ప్రమాదం జరిగింది. సందీప్ అతివేగంగా నడుపుతూ వచ్చిన కారు రోడ్డు దాటుతున్న నందులాల్ను తీవ్రంగా ఢీకొట్టింది. తీవ్ర గాయాలతో రోడ్డుపై పడి ఉన్న నందులాల్ను కాపాడేందుకు జైద్ షా ఖాద్రీ అనే విద్యార్థి స్పందించి, తన కారులో ఆసుపత్రికి తరలిస్తుండగా ఈ మార్గంలో మరో ప్రమాదం చోటుచేసుకుంది. సందీప్ కారును మరో మహీంద్రా కారు వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ అనూహ్య పరిణామాల మధ్య గాయపడిన నందులాల్ మృతి చెందాడు. ప్రమాదానికి పాల్పడిన తర్వాత వెనుక నుంచి ఢీకొట్టిన మహీంద్రా కారు ఏమాత్రం ఆగకుండా అక్కడి నుంచి పరారైంది.
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న రాయదుర్గం పోలీసులు వెంటనే రంగంలోకి దిగి సీసీటీవీఆధారంగా దర్యాప్తు చేపట్టారు. సాంకేతిక నిపుణుల సాయంతో ప్రమాదానికి కారణమైన సందీప్ కారుతో పాటు, దానిని ఢీకొట్టి వెళ్లిపోయిన మహీంద్రా కారును పోలీసులు గుర్తించారు. ఈ కేసులో రెండు వాహనాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు, ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయిని కూడా విచారించి, ప్రమాదానికి కారకుడైన ఆయన కుమారుడు సందీప్ను అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.