Amitabh Bachchan | బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ ప్రమాదానికి గురయ్యాడు. హైదరాబాద్లో జరుగుతున్న ప్రాజెక్ట్-K షూటింగ్లో అమితాబ్ గాయపడ్డాడు. యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అమితాబ్ ముంబైలోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ప్రాజెక్ట్-K సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్లోని రామోజీ ఫిలిం సిటీలో జరుగుతోంది. మార్చి 4న ఈ సినిమా షూటింగ్లో అమితాబ్ ప్రమాదానికి గురయ్యాడు. దీంతో అప్రమత్తమైన చిత్ర యూనిట్ హుటాహుటిన అమితాబ్ను గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి తరలించింది. ఈ ప్రమాదంలో అమితాబ్ పక్కటెముకలకు గాయాలయినట్లు తెలుస్తుంది. దాదాపు రెండు రోజులు పాటు అమితాబ్ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నాడు. రెండు వారాల పాటు బెడ్ రెస్ట్ తీసుకోవాలని వైద్యులు సూచించడంతో.. ఆదివారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అవ్వగానే ముంబై వెళ్లిపోయాడు. అక్కడే తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఈ విషయాన్ని అమితాబ్ బచ్చన్ స్వయంగా సోషల్ మీడియాలో చెప్పుకొచ్చాడు.
ప్రభాస్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ప్రాజెక్ట్-K సినిమాకు నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నాడు. దీపికా పదుకునే హీరోయిన్గా నటిస్తుంది. ఇప్పటికే 70శాతం షూటింగ్ కూడా పూర్తయింది. సై-ఫై జానర్లో తెరకెక్కుతున్న ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇప్పటికే రిలీజైన పోస్టర్లు సినిమాపై విపరీతమైన అంచనాలు క్రియేట్ చేశాయి. వైజయంతీ మూవీస్ బ్యానర్పై అశ్వినీదత్ ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నాడు.