Keerthy Suresh | మల్లెతీగలా సన్నగా ఉంటే అవకాశాలు ఎక్కువ వస్తాయని కొందరు కథానాయికల అభిప్రాయం. అందుకే బొద్దుదనంలో ఉండే ముద్దుదనం తెలీక, జిమ్ములకెళ్లి, గంటల తరబడి చమటోర్చి, ఒంపుసొంపులన్నింటినీ కరిగించేసుకుంటున్నారు. అలా తగ్గిన వయ్యారిభామల్లో కీర్తిసురేశ్ ఒకటి. బరువు తగ్గిన కీర్తిని చూసిన చాలామంది, ‘మహానటి’ నాటి అందం ఏది? అంటూ పెదవి విరుస్తున్నారు. ఈ బరువు తగ్గిన కారణం చేత, ఓ మంచి అవకాశాన్ని కూడా పోగొట్టుకుంది కీర్తి. భారత దిగ్గజ ఫుల్బాల్ కోచ్ సయ్యద్ అబ్దుల్ రహీం జీవితం ఆధారంగా అమిత్శర్మ తెరకెక్కించిన చిత్రం ‘మైదాన్’.
ఇందులో అబ్దుల్ రహీంగా అజయ్దేవగణ్ నటించారు. రహీం భార్య పాత్ర ఈ కథలో కీలకం. ఆ పాత్రకోసం ముందు కీర్తిసురేశ్ను అనుకున్నారు దర్శకుడు అమిత్శర్మ. కానీ ఆమె అనూహ్యంగా బరువు తగ్గడం గమనించిన అమిత్, ఆ స్థానంలో ప్రియమణిని తీసుకున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని ఆయన చెబుతూ -‘ మొదట కీర్తినే అనుకున్నాం. ఆమెకు కథ చెప్పడానికి ప్రిపేర్ అయ్యాను కూడా. కానీ ఆమె బాగా బరువు తగ్గారు. ఆ పాత్ర కాస్త బొద్దుగా ఉండాలి. అందుకే ప్రియమణిని తీసుకున్నాం’ అని తెలిపారు. ఏదేమైనా బరువు తగ్గడంవల్ల కీర్తికి మంచి పాత్ర మిస్ అయ్యిందనే చెప్పాలి. ఏప్రిల్ 10న ఈ చిత్రం విడుదల కానుంది. ఇదిలావుంటే.. వరుణ్ధావన్ హీరోగా ఎ.కాళేశ్వరన్ తెరకెక్కిస్తున్న చిత్రం ద్వారా బాలీవుడ్కి పరిచయం అవుతున్నది కీర్తి సురేశ్.