నరేష్ హీరోగా నటిస్తున్న సినిమా ‘ఉగ్రం’. మిర్నా మీనన్ నాయికగా కనిపించనుంది. ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మించారు. ఎమోషనల్ యాక్షన్ మూవీగా దర్శకుడు విజయ్ కనకమేడల రూపొందించారు. ఈ నెల 5న ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతున్నది. తాజాగా ప్రీ రిలీజ్ కార్యక్రమాన్ని హైదరాబాద్లో నిర్వహించారు. ఇందులో అడివి శేష్, నిఖిల్, సందీప్ కిషన్, దర్శకులు హరీశ్ శంకర్, అనిల్ రావిపూడి అతిథులుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నరేష్ మాట్లాడుతూ…‘నా 60వ చిత్రమిది. ఈ ప్రయాణంలో సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. ఈ సినిమా ఖరారు చేసుకున్నప్పుడే మా గత చిత్రం నాంది కంటే బాగుండాలని అనుకున్నాం.
ఇందుకు స్క్రిప్ట్, మ్యూజిక్, స్టంట్స్ వంటి అన్ని అంశాల్లో జాగ్రత్తలు తీసుకున్నాం. 73 రోజుల పాటు రోజుకు పదహారు గంటలు ఈ సినిమా కోసం కష్టపడ్డాను. ఇప్పటిదాకా నేను కామెడీ, ఎమోషన్ చేశాను. కానీ మొదటిసారి యాక్షన్ చూపించబోతున్నాను. ఆరు ఫైట్స్ ఆకట్టుకుంటాయి. నటుడిగా నాలోని ఉగ్రరూపం చూస్తారు’ అన్నారు. దర్శకుడు విజయ్ కనకమేడల మాట్లాడుతూ…నరేష్తో నా కాంబినేషన్ విజయవంతంగా సాగుతున్నది. ఈ చిత్రంలో ఆయనను కొత్త కోణంలో చూస్తారు. నాయికగా మిర్నా, బాలనటి ఊహ నటన మిమ్మల్ని ఆకట్టుకుంటుంది. యాక్షన్ సీక్వెన్సులన్నీ ప్రత్యేక ఆకర్షణ అవుతాయి. అన్నారు. నిర్మాత హరీశ్ పెద్ది మాట్లాడుతూ…ఈ సినిమా కోసం దర్శకుడు విజయ్ రాజీ లేకుండా పనిచేశారు. మేము పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టాడు. ఈ సినిమా తప్పకుండా విజయం సాధిస్తుంది. అన్నారు.