‘తొలిప్రేమ’ చిత్రంలో పవన్ కల్యాణ్ సోదరిగా నటించి ఆకట్టుకున్న వాసుకి..ఆ తర్వాత చిత్ర పరిశ్రమకు దూరమైంది. ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయితో వివాహం అనంతరం పూర్తిగా వ్యక్తిగత జీవితానికే పరిమితమైంది. ఇన్నేండ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఆమె నటించిన సినిమా ‘అన్నీ మంచి శకునములే’. ఈ చిత్రాన్ని స్వప్న సినిమా, మిత్రవిందా మూవీస్ సంయుక్తంగా నిర్మించాయి. ప్రియాంక దత్ నిర్మాత. నందిని రెడ్డి దర్శకత్వం వహించారు. సకుటుంబ కథా చిత్రంగా రూపొందిన ఈ సినిమా ఈ నెల 18న విడుదలకు సిద్ధమవుతున్నది. ఈ సందర్భంగా సినిమాలో నటించిన అనుభవాలు తెలిపింది వాసుకి. ఆమె మాట్లాడుతూ…“తొలిప్రేమ’ సినిమాలో నటించేప్పుడు నా వయసు 18 ఏండ్లు. కొత్త ప్రాంతం, భాష తెలియదు..దర్శకుడు కరుణాకరన్ చెప్పినట్లు నటించాను. ఆ పాత్రకు ఉత్తమ సహాయ నటిగా నంది పురస్కారం దక్కింది.
ఆ ఘనత దర్శకుడికే చెందుతుందని చెప్పాను. ఆ తర్వాత ఇక సినిమాల్లో నటించలేదు. పెళ్లి, పిల్లలు, వారి చదువులతోనే సరిపోయింది. ఇప్పుడు ఇద్దరు పిల్లలు ఉన్నత విద్య కోసం విదేశాల్లో ఉన్నారు. నేను కావాలనుకున్నది చేయవచ్చు అనిపించింది. మధ్యలో రామ్చరణ్, పవన్ కల్యాణ్ సినిమాల్లో అవకాశాలు వచ్చాయి గానీ నాకు నటించాలని అనిపించలేదు. అశ్వనీదత్ కుటుంబంతో మాకు మంచి సాన్నిహిత్యం ఉంది. మా ఆయన ఆనంద్ వారి సినిమాలకు పనిచేశారు. ఎదురెదురు ఇండ్లలో చాలాకాలంగా ఉంటున్నాం. స్వప్న, ప్రియాంక స్నేహితులు. స్వప్న గతంలోనూ వారి సినిమాల్లో నటించమని అడిగింది. నేను తిరస్కరిస్తూ వచ్చాను. ఈ సినిమా కోసం సంప్రదించినప్పుడు కథ విని చెబుతాను అన్నాను. దర్శకురాలు నందినీరెడ్డి చెప్పిన కథ ఆకట్టుకుంది. ఈ సినిమాలో నేను హీరో అక్క పాత్రలో కనిపిస్తాను. ప్రతి సందర్భంలో తమ్ముడిని వెనకేసుకు వచ్చే అక్క పాత్ర నాది. ఇలాంటి అక్కలు నిజ జీవితాల్లో చాలా మంది ఉంటారు. ఈ మధ్య అన్నీ యాక్షన్ మూవీస్, మనసులపై చెడు ప్రభావం చూపించే సినిమాలు వస్తున్నాయి. కానీ ఇది ఒక ఆహ్లాదకరమైన సినిమా. ఫీల్ గుడ్ మూవీ. కథలో ఎంతసేపు ఉన్నామనే కంటే ఒక్క సీన్లోనూ పేరు తెచ్చుకోవచ్చు. ఈ సినిమాలో నాకు మంచి పేరొస్తుందని ఆశిస్తున్నా. నచ్చిన క్యారెక్టర్స్ దొరికితే తప్పకుండా నటిస్తా’ అని చెప్పింది
మా ఆయన ఆనంద్ సాయి ఆర్ట్ వర్క్లో హెల్ప్ చేస్తుంటా. యాదాద్రి ఆలయ నిర్మాణంలోనూ ఆయనతో కలిసి పనిచేశా. ఈ ప్రాజెక్ట్ కోసం జరిగిన చర్చల్లో పాల్గొన్నాను. ఆనంద్ మీటింగ్లో మాట్లాడేవి వింటూ డిజైన్ వేసేవారు. నేను ప్రతి విషయం నోట్ చేసుకునేదాన్ని. ఇది మా జీవితాల్లో చిరకాలం గుర్తుండిపోయే ప్రాజెక్ట్. ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సూచనలతో పనిచేశాం. కేసీఆర్ గారు మా ఆయనను సత్కరించడం ఓ మధురఘట్టం. యాదాద్రి ప్రాజెక్ట్లో ప్రతి దశ పని మనసులో గుర్తుండిపోయింది. ఇది తరతరాలు మా కుటుంబ సభ్యులు గర్వపడేలా చేసింది.