న్యూఢిల్లీ, ఆగస్టు 19: విప్రో ఉద్యోగులకు షాకిచ్చింది. మార్జిన్ల ఒత్తిడి కారణంగా పనితీరు ఆధారంగా ఇచ్చే అదనపు చెల్లింపులను నిలిపివేస్తున్నట్లు తాజాగా ప్రకటించింది. వేరియబుల్ పేలో కోత పెట్టిన విషయాన్ని సంస్థ ఉద్యోగులకు ఈ-మెయిల్ ద్వారా సమాచారం ఇచ్చినట్లు కంపెనీ వర్గాలు సూచనప్రాయంగా వెల్లడించాయి. ఉద్యోగుల్లో ప్రతిభలో అసమర్థత వల్ల తొలి త్రైమాసికంలో మార్జిన్లపై ప్రతికూల ప్రభావం పడిందని, దీంతో ప్రతిభ, టెక్నాలజీపై భారీగా పెట్టుబడులు పెట్టడానికి సంస్థ సిద్ధమైంది. దీనిపై కంపెనీ ప్రతినిధి స్పందిస్తూ..గతంలో ప్రకటించినట్లుగా వేతన పెంపు ఉంటుందని, సెప్టెంబర్ 1 నుంచి ఉద్యోగుల వేతనాలు పెంచుతున్నట్లు తెలిపారు. జూన్ 30 నాటికి సంస్థలో 2,58,574 మంది సిబ్బంది పనిచేస్తున్నారు.