న్యూఢిల్లీ, ఏప్రిల్ 21: ప్రైవేటీకరణకు ఉద్దేశించిన కంపెనీలను ఇతర ప్రభుత్వ రంగ సంస్థలు (సీపీస్ఈలు) కేంద్ర కొనుగోలు చేయడాన్ని ఆర్థిక శాఖ నిషేధించింది. ప్రైవేటీకరణ పేరుతో ఒక ప్రభుత్వ సంస్థను మరోటి కొనడం డిజిన్వెస్ట్మెంట్ విధాన ప్రయోజనాన్నే దెబ్బతీస్తుందని పేర్కొంది. ఈ కారణంగా ప్రజా ప్రయోజనాల రీత్యా కేంద్ర ప్రభుత్వం ఆమోదిస్తే తప్ప, పీఎస్ఈలు ( కేంద్రం/రాష్ట్రం/జాయింట్)/రాష్ట్ర ప్రభుత్వాలు/ప్రభుత్వాలకు చెందిన సహకార సంఘాలు…ఇతర పీఎస్యూల డిజిన్వెస్ట్మెంట్/ప్రైవేటీకరణలో పాలుపంచుకోవడాన్ని అనుమతించేది లేదని ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. గతంలో కొన్ని కేంద్ర ప్రభుత్వ సంస్థల్ని అదే రంగంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న పీఎస్యూలకు విక్రయించారు. 2001-02లో ఇండో బర్మా పెట్రోలియం (ఐబీపీ)ను ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ)కు, 2018లో హెచ్పీసీఎల్ను ఓఎన్జీసీకి విక్రయించారు. అలాగే 2019 మార్చిలో రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ (ఆర్ఈసీ)లో 53 శాతం ప్రభుత్వ వాటాను పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (పీఎఫ్సీ) కొన్నది. 2000-2020 మధ్యకాలంలో మొత్తం 9 కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్ని అదే రంగంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న పీఎస్యూలకు విక్రయించారు.