Stocks | దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం కొనుగోళ్ల మద్దతుతో కలకలలాడాయి. రిలయన్స్, ఎల్&టీ, ఐటీసీ, కొటక్ మహీంద్రా బ్యాంక్, భారతీయ స్టేట్ బ్యాంక్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ సహా ప్రధాన స్టాక్స్కు ఇన్వెస్టర్ల నుంచి కొనుగోళ్ల మద్దతు లభించింది. విదేశీ ఇన్వెస్టర్లు సైతం స్టాక్స్ కొనుగోళ్లకు దిగడంతో బీఎస్ఈ-30 ఇండెక్స్ సెన్సెక్స్ 463 పాయింట్ల లాభంతో 61,112 పాయింట్ల వద్ద ముగిసింది.
నెస్ల్టే ఇండియా, విప్రో, ఎల్ & టీ, ఎస్బీఐ, ఐటీసీ, టెక్ మహీంద్రా తదితర స్టాక్స్ మూడు శాతం వరకు లాభ పడ్డాయి. యాక్సిస్ బ్యాంక్, హెచ్సీఎల్, టైటాన్, హెచ్యూఎల్, బజాజ్ ఫిన్ సరర్వ్ స్టాక్స్ స్వల్పంగా నష్టపోయాయి. బీఎస్ఈ మిడ్ క్యాప్ 1.3 శాతం, స్మాల్ క్యాప్ ఒక శాతం లాభాలతో ముగిశాయి. ఉదయం ట్రేడింగ్ ప్రారంభంలో సెన్సెక్స్, నిఫ్టీ సూచీల మధ్య లాభ నష్టాలు దోబూచులాడాయి.
బీఎస్ఈలో 60,721.61 పాయింట్ల వద్ద స్వల్ప లాభంతో మొదలైన ట్రేడింగ్.. తదుపరి నష్టాల్లో చేరుకుంది. తిరిగి స్టాక్స్ పుంజుకున్నా.. స్వల్ప లాభాలకే పరిమితం అయ్యింది. మరోవైపు ఎన్ఎస్ఈ-50 సూచీ నిఫ్టీ 150 పాయింట్లు వృద్ధి చెంది 18,065 పాయింట్ల వద్ద స్థిర పడింది. గత ఫిబ్రవరి 20 తర్వాత నిఫ్టీ 18 వేల మార్క్ను దాటడం ఇదే తొలిసారి.
ఈ వారం దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. అన్ని సెషన్లలోనే ఇండెక్స్లు పుంజుకున్నాయి. ఫారెక్స్ మార్కెట్లో అమెరికా డాలర్పై రూపాయి మారకం విలువ రూ.81.81 వద్ద ముగిసింది.