నేటి నుంచి ఆటోడెబిట్ కొత్త రూల్స్ అమలు
రక్షణ కోసమే అంటున్న రిజర్వుబ్యాంక్ వర్గాలు
హైదరాబాద్, సెప్టెంబర్ 30 (నమస్తే తెలంగాణ): “సురేశ్ ఒక వ్యాపారవేత్త. హడావుడిలో పడిపోయి ప్రతి నెల కరంటు, ఫోన్ బిల్లులు ఆలస్యంగా చెల్లిస్తున్నాడు. దీంతో అపరాధ రుసుము పడుతున్నది. దీంతో బిల్లుల చెల్లింపులతోపాటు ఓటీటీ సబ్స్క్రిప్షన్ సైతం ‘ఆటోడెబిట్’ ఎంచుకొన్నాడు. సమయానికి అకౌంట్ నుంచి బిల్లుల చెల్లింపు జరిగిపోతున్నది.
సురేశ్ కొన్నాళ్ల తర్వాత కొత్త ఇంటికి మారిపోయాడు.. ఫోన్ మార్చేశాడు.. అయినా తన అకౌంట్ నుంచి తెలియకుండానే బిల్లుల చెల్లింపులు జరుగుతున్నాయి. ఓటీటీ వచ్చే నెల నుంచి ఓటీటీ సబ్స్క్రిప్షన్ వద్దు అని నిర్ణయించుకున్నా.. చెల్లింపు జరిగే సమయానికి గుర్తు లేకపోవడంతో డబ్బులు వృథా అవుతున్నాయి. కొన్నాళ్ల తర్వాత అకౌంట్ స్టేట్మెంట్ చూసుకుంటే కొన్ని థర్డ్ పార్టీ సంస్థలు తను వద్దని చెప్పినా డబ్బు వసూలు చేసినట్టు తేలింది.”
ఆటోడెబిట్ వల్ల మొదటి ఉదాహరణ లాభమయితే.. రెండో ఉదాహరణ నష్టం. వీటిని నివారించేందుకే కొత్త నిబంధనలు తీసుకొచ్చినట్టు రిజర్వుబ్యాంక్ చెప్తున్నది. ఆటోమెటిక్ బిల్ పేమెంట్స్కు సంబంధించి శుక్రవారం నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి వస్తున్నాయి. మొబైల్, కరెంటు వంటి బిల్లులు, ఓటీటీల సబ్స్రిప్షన్ వంటి యుటిలిటీస్ బిల్లులు, నెలవారీ బిల్లులు చెల్లించే ముందు ఇకపై బ్యాంకులు, ఫిన్టెక్ సంస్థలు వినియోగదారుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. ఈఎంఐలు, మ్యూచువల్ ఫండ్స్, సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (ఎస్ఐపీ)లకు మాత్రం మినహాయింపు ఉంటుంది.
రూ.5 వేల లోపు బిల్లులు అయితే ‘అడిషనల్ ఫ్యాక్టర్ అథెంటిఫికేషన్’ (ఏఎఫ్ఏ) తప్పనిసరి. అంటే బ్యాంకులు లేదా ఫిన్టెక్ సంస్థలు బిల్లు చెల్లించే ముందు వినియోగదారుడికి ఎస్ఎంఎస్ లేదా ఈ-మెయిల్ ద్వారా అలర్ట్ మెసేజ్ పంపుతాయి. కస్టమర్ అంగీకరిస్తేనే చెల్లింపులు జరుగుతాయి. లేదంటే ఆ చెల్లింపు ఆగిపోతుంది.
ఒకవేళ బిల్లు రూ.5 వేలు దాటితే.. ఒక రోజు ముందుగానే బ్యాంకులు వినియోగదారుడికి ఓటీపీ పంపుతాయి. దానిని ఎంటర్ చేస్తేనే బిల్లుల చెల్లింపు జరుగుతుంది. అంతేకాదు.. ఎంతకాలంపాటు ఆటోడెబిట్ కొనసాగుతుందో స్పష్టం చేయాల్సి ఉంటుంది.
రక్షణా.. రుద్దుడా?
కొత్త నిబంధనలపై కొందరు వినియోగదారులు, నిపుణులు పెదవి విరుస్తుండగా.. మరికొందరు సానుకూలంగా స్పందిస్తున్నారు. ఆర్బీఐ తన అధికారాలను అడ్డంపెట్టుకొని అనవసరంగా నిబంధనలు రుద్దుతున్నదని ఆరోపిస్తున్నారు. ప్రతి నెల బిల్లుల చెల్లింపునకు ప్రత్యేకంగా సమయం కేటాయించలేకే ఆటోడెబిట్ ఎంచుకున్నామని చెప్తున్నారు. అయితే ఆర్బీఐ వర్గాలు మాత్రం వినియోగదారుల రక్షణకే ఈ నిబంధన తెచ్చినట్టు చెప్పాయి. కస్టమర్లు వద్దని చెప్తున్నా కొన్ని థర్డ్ పార్టీ కంపెనీలు ఆటోడెబిట్ ఆప్షన్ను వాడుకొని డబ్బులు వసూలు చేస్తున్నాయని ఆర్బీఐకి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతోపాటు కొన్ని సేవలకు సంబంధించి (ఓటీటీ సబ్స్రిప్షన్, కరంటు, ఫోన్ బిల్లులు వంటివి) ఆటోడెబిట్ ఆప్షన్ను ఎంచుకోవడం సులభంగా ఉంటున్నా.. వాటిని ఎలా నిలిపివేయాలన్నది వినియోగదారులకు పెద్ద ప్రశ్న. దీంతో ఇష్టం లేకపోయినా కొన్ని నెలలపాటు అనవసరంగా బిల్లుల చెల్లింపులు జరుగుతున్నది. ఇకపై ఇలాంటి నష్టాలు ఉండబోవని ఆర్బీఐ వర్గాలు వెల్లడించాయి.