ఆసియాలో అపర కుబేరుడుగా తిరిగి రిలయన్స్ అధినేతల్లీ, జూన్ 3: రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) అధినేత ముకేశ్ అంబానీ తిరిగి తన స్థానాన్ని చేజిక్కించుకున్నారు. కొద్ది నెలలుగా ఆసియాలో అత్యంత శ్రీమంతుడిగా కొనసాగుతున్న గౌతమ్ అదానీ స్థానాన్ని తిరిగి అంబానీ ఆక్రమించారు. ఆర్ఐఎల్ షేరు ధర రెండు వారాల నుంచి దూడుకు ప్రదర్శించడం, అదానీ గ్రూప్ షేర్లు క్షీణించడంతో ఈ మార్పు జరిగింది. బ్లూంబర్గ్ రిపోర్ట్ ప్రకారం తాజాగా ముకేశ్ సంపద 99.7 బిలియన్ డాలర్లకు (రూ.7.74 లక్షల కోట్లు) చేరగా, 98.7 బిలియన్ డాలర్ల (రూ.7.66 లక్షల కోట్లు) సంపదతో అదాని గ్రూప్ చైర్మన్ గౌతమ్ ద్వితీయస్థానంతో సరిపెట్టుకున్నారు. దీంతో భారత్లో సైతం ముకేశ్ అంబానీ అత్యంత ఐశ్వర్యవంతుడయ్యారు. ప్రస్తుతానికి అదాని ద్వితీయస్థానానికి దిగినప్పటికీ, రెండేండ్లుగా ఆయన సంపద గణనీయంగా పెరిగింది.
ఆర్ఐఎల్ షేరు శుక్రవారం ట్రేడింగ్ ప్రారంభంలో 3 శాతం పెరిగి రూ.2,816 గరిష్ఠస్థాయిని చేరింది. తుదకు ఇది రూ.2,780 వద్ద ముగిసింది. క్రితం రోజు కూడా 3 శాతంపైగా పెరిగిన ఈ షేరు గత రెండు వారాల్లో 14 శాతం జంప్చేయడం గమనార్హం. ఈ ఏడాది ఏప్రిల్ 24న నమోదు చేసిన ఆల్టైమ్ గరిష్ఠస్థాయి రూ.2,855కు ప్రస్తుతం 3 శాతం దిగువన ఈ షేరు నిలిచి ఉంది.
కొద్ది వారాల నుంచి పలు బ్రాండ్లను అదేపనిగా కొంటున్న ఆర్ఐఎల్ తాజాగా వాల్గ్రీన్స్ బూట్స్ అలియంజ్కు చెందిన అంతర్జాతీయ కెమిస్ట్ , డ్రగ్ స్టోర్ యూనిట్లకు బిడ్ చేస్తుందన్న వార్తలు…రిలయన్స్ షేరుకు మరింత ఊతమిచ్చాయి. ఆర్ఐఎల్, అమెరికా ఇన్వెస్ట్మెంట్ సంస్థ అపోలో గ్లోబల్ మేనేజ్మెంట్ కలిసి బూట్స్ స్టోర్స్ కోసం 9 బిలియన్ డాలర్ల (రూ.70,000 కోట్లు) బిడ్ సమర్పిస్తున్నట్టు వార్త. రిలయన్స్ ఇటీవల వరుసగా హామ్లేస్, క్లోవియా, మిల్క్బాస్కెట్, అర్బన్ లాడర్, హాప్టిక్ల్లో పెట్టుబడులు చేసింది. తాజాగా ఇటలీ ఆటబొమ్మల సంస్థ ప్లాస్టిక్ లెగ్నో ఇండియా సబ్సిడరీ డ్రీమ్ప్లాస్ట్లో 40 శాతం వాటా కొనాలని నిర్ణయించింది.
వరుస ర్యాలీలతో అదరగొడుతున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు ఆల్టైమ్ రికార్డుస్థాయిని అందుకోవాలంటే ప్రస్తుత రూ.2,780 నుంచి మరో 3 శాతం పెరగాల్సి ఉంటుంది. ఈ అంశంపై మార్కెట్ విశ్లేషకుడు సందీప్ సబర్వాల్ మాట్లాడుతూ రష్యా-ఉక్రెయిన్ యుద్ధ పరిణామాలతో లబ్దిపొందుతున్న కారణంగా ఈ షేరు పెరుగుతున్నదని, స్వల్పకాలంలో నూతన గరిష్ఠాన్ని అందుకుంటుందో లేదో చెప్పడం కష్టమన్నారు. ఆర్ఐఎల్ రష్యా నుంచి చౌకగా ముడి చమురును దిగుమతి చేసుకుని, అంతర్జాతీయ మార్కెట్లో పెట్రోలియం రిఫైనరీ ఉత్పత్తులను విక్రయిస్తున్నదన్నారు. తద్వారా భారీ మార్జిన్లో లాభాల్ని ఆర్జిస్తున్నదన్నారు. రష్యా నుంచి దిగుమతులు నిలిపివేసిన అమెరికా, యూరోపియన్ యూనియన్ (ఈయూ) అదే చమురుతో రిఫైన్ అయిన ఉత్పత్తుల్ని ఇతర దేశాలు, కంపెనీల నుంచి కొంటూ అధిక ధరల్ని చెల్లిస్తున్నాయి. ఈ క్రమంలో ఇతర కంపెనీలు, ఇతర దేశాలు లాభపడటాన్ని ఎంతకాలం అమెరికా, ఈయూలు సహిస్తాయో చూడాల్సి ఉందని సబర్వాల్ అన్నారు. ఆర్ఐఎల్ షేరు ధరకు ఈ రిస్క్ పొంచి ఉంటుందన్నారు. వచ్చే కొద్దివారాల్లో ఈ అంశమై ఆర్ఐఎల్కు అవరోధాలు ఏర్పడితే ఆశ్చర్యపడాల్సిందేమీ లేదన్నారు.