న్యూఢిల్లీ, మే 20: భారత్లో నిర్వహిస్తున్న క్యాష్ అండ్ క్యారీ స్టోర్ల వ్యాపారాన్ని విక్రయించాలని జర్మనీ రిటైల్ సంస్థ మెట్రో ఏజీ నిర్ణయించిందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ వ్యాపారం కొనుగోలు చేసేందుకు పలు సంస్థలు పోటీపడుతున్నట్టు సమాచారం. ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్, థాయ్లాండ్కు చెందిన చారొయెన్ పోక్ఫాండ్ (సీపీ) గ్రూప్లతో పాటు రిలయన్స్ రిటైల్, ఎవిన్యూ సూపర్మార్ట్స్(డీమార్ట్ మాతృసంస్థ), టాటా, లులు గ్రూపులు, పీఈ ఫండ్ సమారా క్యాపిటల్లు ఇప్పటికే సంప్రదింపులు జరుపుతున్నాయని ఆ వర్గాలు పేర్కొన్నాయి.
ఈ విక్రయం ద్వారా మెట్రో 1.5-1.75 బిలియన్ డాలర్ల (రూ.11,600-రూ.13,600 కోట్లు) విలువను అంచనావేస్తున్నది. దేశంలో 2003 నుంచి మెట్రో 31 క్యాష్ అండ్ క్యారీ స్టోర్స్ను నిర్వహిస్తున్నది. మార్కెట్లో పెరిగిన పోటీ, కార్యకలాపాల నిర్వహణకు భారీగా పెట్టుబడులు చేయాల్సిరావడం వంటి కారణాలతో భారత్లో వ్యాపారం నుంచి వైదొలగాలని మెట్రో నిర్ణయించింది. సరైన కొనుగోలుదారును అన్వేషించేందుకు ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్లు జేపీ మోర్గాన్, గోల్డ్మాన్ శాక్స్లను నియమించుకుంది. ఉత్పత్తుల్ని వాటి వ్యయంకంటే తక్కువకు విక్రయించడం, ఉత్పత్తుల్ని ఉచితంగా డెలివరీ చేయడంతో క్యాష్ అండ్ క్యారీ వ్యాపారాలు సమస్యల్లో చిక్కుకున్నాయని, పలు పోటీ సంస్థలు 20-25 శాతం నష్టానికి నడుపుతున్నాయని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. మెట్రో ఇండియా విక్రయవార్తలపై ఆ సంస్థ గ్లోబల్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ గెర్డ్ కొస్లోస్కి స్పందిస్తూ ప్రతీ దేశంలోనూ తమ కార్యకలాపాల్ని, వృద్ధి అవకాశాల్ని ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటామని, మార్కెట్ స్పెక్యులేషన్స్పై వ్యాఖ్యానించబోమన్నారు.
ఇండియా వ్యాపారం పట్ల బుల్లిష్గా ఉన్నామని, తమ స్టోర్లు, ఈకామర్స్ వ్యాపారాన్ని విస్తరిస్తామని, గత ఏడాది దేశంలో మూడు కొత్త స్టోర్లను ప్రారంభించామని మెట్రో ఇండియా ప్రతినిధి తెలిపారు. పలు పెద్ద సంస్థలు బీ2బీ విభాగంలో మార్కెట్ వాటాను పెంచుకునేందుకు ప్రతీ ఏడాది మిలియన్ల కొద్దీ డాలర్లను నష్టపోతుండగా, మెట్రో ఒక్కటే లాభాల్ని ఆర్జిస్తున్నదని ఆయన వివరించారు. భారత్లో నిబంధనల ప్రకారం విదేశీ మల్టీ- రిటైల్ సంస్థలు ఇక్కడ స్టోర్లను ఏర్పాటుచేసి, వినియోగదారులకు నేరుగా విక్రయించకూడదు. అందుకు బదులుగా క్యాష్ అండ్ క్యారీ, హోల్సేల్ కార్యకలాపాల్ని నూరు శాతం విదేశీ పెట్టుబడితో నిర్వహించవచ్చు. రిజిష్టర్డ్ బిజినెస్ కస్టమర్లు మాత్రమే ఈ స్టోర్లను సందర్శించి, కొనుగోళ్లు జరపవచ్చు. 2021 ఆర్థిక సంవత్సరంలో మెట్రో ఇండియా 89.8 కోట్ల డాలర్ల ఆదాయాన్ని ఆర్జించింది. ప్రస్తుత ఏడాది ఆదాయం 1 బిలియన్ డాలర్లను మించుతుందని అంచనా. ప్రస్తుతం మెట్రో 34 దేశాల్లో హోల్సేల్, ఫుడ్ రిటైల్ వ్యాపారాల్ని నడుపుతున్నది.