ముంబై: టెలికం సంచలనం రిలయన్స్ జియో.. మరో సంచలనం దిశగా అడుగులేస్తున్నది. ఆల్ట్రా అఫార్డబుల్ జియో ఫోన్ నెక్స్ట్ పేరిట స్మార్ట్ ఫోన్ను వచ్చే సెప్టెంబర్ 10వ తేదీన ఆవిష్కరిస్తున్నట్లు రిలయన్స్ చైర్మన్ ముకేశ్ అంబానీ గురువారం సంస్థ 44వ వార్షిక సమావేశంలో ప్రకటించారు. దేశంలోని 300 మిలియన్ల ఫీచర్ ఫోన్ల యూజర్లను స్మార్ట్ ఫోన్ల వైపు మళ్లించడానికి ఈ ఫోన్ ఉపకరిస్తుందని అంచనా.
కానీ దీని ధర ఎంత అన్నది కీలకం కానున్నదని ఇండస్ట్రీ పరిశీలకులు అభిప్రాయ పడుతున్నారు. రిలయన్స్ జియో టీమ్.. టెక్నాలజీ టైటాన్ గూగుల్ బ్రుందంతో కలిసి ఇండియా కోసం జియో ఫోన్ నెక్స్ట్ ఫోన్ను డెవలప్ చేస్తున్నది.
ఈ ఫోన్ అత్యంత చౌక స్మార్ట్ ఫోన్ కేవలం భారత్లో మాత్రమే కాక ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి వస్తుంది. ఇండస్ట్రీ ఇంటెలిజెన్స్ గ్రూప్ సీఎంఆర్ హెడ్ ప్రభురామ్ మాట్లాడుతూ.. మొబైల్-ఫస్ట్ నేషన్గా భారత్ శక్తిమంతమైందని చెప్పారు.
ఇప్పటికే భారత్ డిజిటల్ ఎకానమీ ఎదిగిందని, అయినా గ్రోత్కు అవకాశం ఉంటుందని ప్రభురామ్ అన్నారు. కౌంటర్ పాయింట్ రీసెర్చ్ అసోసియేట్ డైరెక్టర్ తరుణ్ పాఠక్ మాట్లాడుతూ గూగుల్-జియో ఫోన్ నెక్స్ట్ ధర కీలకం అని చెప్పారు.
కరోనాకు ముందు రూ.5000 పై చిలుకు సెగ్మెంట్ ఫోన్ల వినియోగదారులు కేవలం ఐదు శాతం ఉన్నారని తరుణ్ పాఠక్ తెలిపారు. జియో స్మార్ట్ ఫీచర్ ఫోన్ యూజర్లైన 65 మిలియన్ల మందిని స్మార్ట్ ఫోన్ల వైపు మళ్లించడమే రిలయన్స్ లక్ష్యం అని చెప్పారు.
దేశంలో 320 మిలియన్ల మంది ఫీచర్ ఫోన్ యూజర్లు ఉన్నారని తరుణ్ పాఠక్ తెలిపారు. కరోనా ప్రభావంతో ఇబ్బందులు పడ్డ వీరిని చేరుకోవడం సవాల్ అని చెప్పారు. సాధారణ వ్యక్తుల దగ్గరకు చేరాలంటే జియో వారికి భారీగా బెనిఫిట్లు కల్పించాల్సి ఉంటుందన్నారు.