న్యూఢిల్లీ, డిసెంబర్ 30: ప్రపంచ ప్రధాన కరెన్సీల్లో రూపాయి బలంగా ఉందంటూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రెండు నెలల క్రితం చేసిన వాదనల్ని ఫారిన్ కరెన్సీ ఎక్సేంజ్ (ఫారెక్స్) మార్కెట్ పూర్తిగా తోసిపుచ్చింది. వాణిజ్యలోటు, కరెంటు ఖాతా లోటు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో భారత్ కరెన్సీ అంతకంతకూ క్షీణిస్తూ వచ్చింది. దీంతో 2022 సంవత్సరంలో రూపాయి ఆసియాలోకెల్లా అత్యంత చెత్త కరెన్సీగా మిగిలిపోయింది. గరిష్ట వడ్డీ రేట్లు, అధిక ద్రవ్యోల్బణంతో అమెరికా డాలర్ బలపడినప్పటికీ, ఆసియా దేశాల్లో ఏ కరెన్సీ తగ్గనంత తీవ్రంగా రూపాయి ఈ ఏడాది 11.3 శాతం పతనమయ్యింది. 2021 చివరి ట్రేడింగ్ రోజున డాలరు మారకంలో 74.33 వద్దనున్న రూపాయి విలువ 2022 ఫారెక్స్ ట్రేడింగ్కు ఆఖరిరోజైన శుక్రవారం 82.72 వద్ద ముగిసింది. ఇప్పుడు ఒక డాలర్ విలువైన వస్తూత్పత్తులను దిగుమతి చేసుకోవాలంటే దాదాపు 83 రూపాయిలు చెల్లించాల్సిందే. ఆ మేరకు దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు, వంటనూనెలు, పప్పుదినుసులు, ఎలక్ట్రానిక్స్..ఇలా ఒకటేమిటి మనం దిగుమతులపై ఆధారపడ్డ ప్రతీ ఉత్పత్తి ధర పెరుగుదలకు రూపాయి క్షీణత కారణమయ్యింది.
ఆసియాలోని పది ప్రధాన కరెన్సీల్లో ఒక్క సింగపూర్ డాలర్ మాత్రం 2022లో అమెరికా డాలరు మారకంలో స్వల్పంగా బలపడింది. ఇక మిగిలిన కరెన్సీల్లో రెండంకెల్లో పతనాన్ని చవిచూసింది రూపాయే కాగా, మిగిలిన దేశాల కరెన్సీ విలువల క్షీణత సింగిల్ డిజిట్కే పరిమితమయ్యింది. అధ్వాన్న ఆసియా కరెన్సీల జాబితాలో 86 శాతం క్షీణతతో చైనా యువాన్ ద్వితీయస్థానాన్ని ఆక్రమించగా, 8-8.5 శాతం తగ్గుదలతో ఆ తదుపరి స్థానాల్లో ఇండోనేషియా రుపయ్యా, ఫిలిప్పీన్స్ పెసోలు నిలిచాయి. మలేషియా రింగిట్, తైవాన్ డాలర్లు సైతం 8-8.5 శాతం మధ్య క్షీణించాయి.
అమెరికా ఫెడ్ గరిష్ట వడ్డీ రేట్లను ఎక్కువకాలం కొనసాగించడం, మాంద్య పరిస్థితుల కారణంగా భారత్ ఎగుమతులు తీవ్రంగా దెబ్బతినడం రూపాయికి పెద్ద రిస్క్లని ఐసీఐసీఐ సెక్యూరిటీస్ డెరివేటివ్స్ హెడ్ రాజ్ దీపక్ సింగ్ చెప్పారు. ఇండియా స్టాక్ మార్కెట్లో అమ్మకాలు జరిగితే రూపాయి పుంజుకోవడం సాధ్యపడదని ఓసీబీసీ బ్యాంక్ ఫారెక్స్ స్ట్రాటజిస్ట్ క్రిస్టోఫర్ వాంగ్ చెప్పారు. ఒక వేళ రూపాయి కొంత పెరిగినప్పటికీ, ఆసియా కరెన్సీలకంటే వెనుకబడే ఉంటుందన్నారు.