ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ)లోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్డీఐ) రానున్నాయా?.. విదేశీ మదుపరుల చేతికి సంస్థలోని అగ్రభాగం వెళ్లనున్నదా?..అంటే అవునన్న సమాధానాలు వినిపిస్తున్నాయి. పబ్లిక్ ఇష్యూ (ఐపీవో) ద్వారా స్టాక్ మార్కెట్లలోకి ఎల్ఐసీని ప్రవేశపెడుతున్న మోదీ సర్కారు.. ఎఫ్డీఐ పేరుతో అధిక వాటాను విదేశీ ఇన్వెస్టర్లకు కట్టబెట్టేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నదిప్పుడు.
న్యూఢిల్లీ, ఆగస్టు 24: నిధుల సమీకరణ పేరుతో ప్రభుత్వ ఆస్తులను, వాటాలను అమ్మేస్తున్న మోదీ సర్కారు.. ఎల్ఐసీనీ విడిచిపెట్టడం లేదు. ఖజానాకే కల్పతరువులా వర్ధిల్లుతున్న ఎల్ఐసీలో ఇప్పటికే పెట్టుబడుల ఉపసంహరణకు కేంద్రం తెరలేపిన విషయం తెలిసిందే. ఇప్పుడు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులనూ అనుమతించాలని అనుకుంటున్నది. ఈ మేరకున్న ప్రతిపాదనపై కేంద్ర ఆర్థిక సేవల శాఖ, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ-పెట్టుబడుల శాఖ మధ్య గతకొద్ది వారాలుగా చర్చలు జరుగుతున్నాయి. ఇదే జరిగితే ఓ విదేశీ మదుపరి చేతికి ఎల్ఐసీలోని సింహభాగం చేరడం ఖాయమన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. భారీ పెన్షన్ ఫండ్స్ లేదా ఇన్సూరెన్స్ కంపెనీలు వాటా కోసం పోటీపడే వీలున్నది. అయితే ఎఫ్డీఐపై చర్చలు ఇప్పుడిప్పుడే మొదలవుతున్నాయని పేరు చెప్పేందుకు ఇష్టపడని ఓ అధికారి వెల్లడించారు. ఎంత మేరకు అనుమతించాలి, వ్యూహాత్మక పెట్టుబడులు ఎలా ఉంటాయన్నదానిపై ఇంకా స్పష్టత లేదన్నారు. విదేశాల్లోని వ్యక్తి లేదా సంస్థ 10 శాతం, అంతకంటే ఎక్కువ వాటాను కొంటే దాన్ని ఎఫ్డీఐగా రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) నిర్వచిస్తున్న విషయం తెలిసిందే.
సామాన్యుడి భరోసా
ఎల్ఐసీ అంటే కేవలం ఓ ప్రభుత్వ బీమా సంస్థనే కాదు.. సగటు భారతీయుడి భరోసా కూడా. అందుకే దేశీయ బీమా రంగంలో సుమారు 70 శాతం వాటా ఎల్ఐసీదే. రకరకాల పాలసీలతో పేద, మధ్యతరగతి కుటుంబాల్లో ఆర్థికంగా కొండంత అండగా నిలుస్తున్నదీ సంస్థ. 64 ఏండ్ల క్రితం 1956 సెప్టెంబర్ 1న ఎల్ఐసీని స్థాపించారు. అప్పట్నుంచి ఇంతింతై.. వటుడింతై అన్నట్లుగా ఎదుగుతూ భారతీయ భారీ సంస్థాగత మదుపరుల్లో ఒకటిగా స్థిరపడింది. ప్రస్తుతం సంస్థలో 100 శాతం వాటా కేంద్ర ప్రభుత్వానిదే. 2019 నాటికి సంస్థకు దాదాపు రూ.32 లక్షల కోట్ల ఆస్తులున్నాయి. 1.15 లక్షల మంది ఉద్యోగులున్నారు. 15.37 లక్షలకుపైగా ఏజెంట్లున్నారు.
చట్టాన్ని సవరించాల్సిందే
ఎల్ఐసీలో ఎఫ్డీఐని అనుమతించాలంటే చట్టాన్ని సవరించాల్సిందే. పార్లమెంట్ ద్వారా చేసిన ఓ చట్టంతో ఏర్పడిన ప్రత్యేక సంస్థే ఈ ఎల్ఐసీ. అందుకే దేశీయ బీమా రంగంలోకి 74 శాతం ఎఫ్డీఐని కేంద్ర ప్రభుత్వం అనుమతించినా.. ఎల్ఐసీకి మాత్రం అది వర్తించట్లేదు. దీంతో ఇప్పుడు చట్టాలను సవరించి ఎఫ్డీఐకి పచ్చజెండా ఊపే పనిలో మోదీ సర్కారున్నది. నిజానికి పబ్లిక్ ఆఫర్లో ఎఫ్పీఐలు, ఎఫ్డీఐకి మార్కెట్ రెగ్యులేటర్ సెబీ నిబంధనల ప్రకారం అనుమతి ఉన్నది. అయినప్పటికీ ఎల్ఐసీ విషయంలో మాత్రం చట్ట సవరణ తప్పనిసరి అవుతున్నది. కాగా, ఈ ఆర్థిక సంవత్సరం జీడీపీలో బడ్జెట్ లోటును 6.8 శాతానికి తగ్గించాలంటే ఎల్
ఐసీ వాటాల విక్రయం ఒక్కటే ఇప్పటికిప్పుడు కేంద్రం ముందున్న మార్గం. అందుకే ఎల్ఐసీ ఐపీవోకు చకచకా పనులు జరిగిపోతున్నాయి. ఈ ఐపీవో నిర్వహణ కోసం 16 దేశ, విదేశ మర్చంట్ బ్యాంకర్లు ఆసక్తి చూపగా, బుధవారం విదేశీ సంస్థలు, గురువారం దేశీయ సంస్థల ప్రజెంటేషన్ను ప్రభుత్వ వర్గాలు వింటున్నాయి. ఎల్ఐసీ విలువను 261 బిలియన్ డాలర్లుగా లెక్కగట్టి ఐపీవోకు తెస్తున్నారు.
విదేశీ గుప్పిట్లోకి
ఎల్ఐసీ ఇక విదేశీ పెట్టుబడిదారుల గుప్పిట్లోకి మారబోతుందా? ఇటీవలి పరిణామాలు అందుకు మార్గాన్ని క్లియర్ చేస్తున్నట్టుగా కనిపిస్తున్నది. ఎల్ఐసీ పబ్లిక్ ఇష్యూ ద్వారా ప్రభుత్వం కొంత వాటాను విక్రయించడం ద్వారా పాలసీదారులను, ప్రజలను భాగస్వాములు చేయడం పైకి చెబుతున్న మాటగా కనిపిస్తున్నది. ఇన్సూరెన్స్ రంగంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల వాటాను గతంలో ఉన్న 49 శాతం పరిమితిని ఈ ఏడాది మార్చిలో 74 శాతానికి పెంచడం ద్వారా వేసిన మొదటి అడుగు పడింది.
ఎల్ఐసీలో ఎంత పెట్టుబడిని అనుమతించాలన్న అంశంపై ఇటీవలే ఓ సమావేశం జరిగింది. ప్రస్తుతం ప్రభుత్వం రంగ బ్యాంకు ల్లో 20 శాతం ఎఫ్డీఐలకు అనుమతి ఉంది. అదే 20 శాతం పరిమితిని ఎల్ఐసీలో కూడా అనుమతించే అంశంపై ఆ సమావేశంలో చర్చించారు. ఈ వాటా ఐపీవో ద్వారా జారీ చేస్తున్న వాటాకు అదనం. ఐపీవో ద్వారా ఎఫ్ఐఐల కొనుగోళ్లు చేసుకునే అవకాశమూ ఉంది. ప్రభుత్వం ఎల్ఐసీ పబ్లిక్ ఇష్యూ ద్వారా దాదాపు లక్ష కోట్ల రూపాయలను సమీకరించాలనుకుంటుంది.
జరిగేది వాగ్ధాన భంగమే!
బీమా పాలసీ అంటే ఒక వాగ్దానం. ఈ వాగ్దానాన్ని ప్రైవేటు కంపెనీల బదులు ప్రభుత్వం ఇస్తేనే నిలబెట్టుకుంటుందనే నమ్మకం ఉంటుంది. కానీ ప్రభుత్వ కంపెనీల్లోకి ప్రైవేటు ఇన్వెస్టర్లు ప్రవేశిస్తే జరిగేది వాగ్దాన భంగమే. అనుమానమే లేదు. టెలికం కంపెనీల్ని చూడండి. కొద్ది సంవత్సరాల క్రితం సిమ్లు తీసుకున్నపుడు రీఛార్జ్తో సంబంధం లేకుండా వాటి కాలపరిమితిని 2030, 2035.. ఇలా నిర్దేశించిన కొద్దికాలంలోనే ఆ గడువు ఎత్తివేసాయి. నెల అంటే 30 రోజుల లెక్కను వదిలేశాయి. రీఛార్జ్ చేసుకోపోతే కనెక్షన్ కట్. బ్యాంకుల్ని చూడండి. ఏడాదిలో ఎన్నిదఫాలు డబ్బు తీసినా, డబ్బువేసినా ఛార్జీలు వుండేవా? ఇప్పుడు ప్రైవేటు బ్యాంకులతో లిస్టెడ్ ప్రభుత్వ బ్యాంకుల పోటీ. లాభార్జనే ధ్యేయం. ప్రతీదానికి ఛార్జీ. రూ.5 లక్షలు దాటిన డిపాజిట్లకు గ్యారంటీ లేదు. ఈ రెండు రంగాల్లో జరిగిన వాగ్దాన భంగమే…ప్రైవేటును, విదేశీ డబ్బును అనుమతిస్తే ఎల్ఐసీలో కూడా జరగబోయేది. ఎల్ఐసీ పాలసీలకు ప్రభుత్వ గ్యారంటీని ఎత్తివేయమంటూ ప్రైవేటు బీమా కంపెనీలు ఎప్పటినుంచో గగ్గోలు పెడుతున్నాయి. ప్రైవేటు పెట్టుబడుల్ని అనుమతించిన తర్వాత ఈ గ్యారంటీ ఉంటుందన్న గ్యారంటీ లేదు. ఏటా ఎల్ఐసీకి వస్తున్న క్లయిముల్లో తిరస్కరణకు గురవుతున్నవి 1 శాతం లోపే. అదే ప్రైవేటు కంపెనీల్లో 8 శాతంపైనే. ఇది కూడా ఎల్ఐసీపట్ల పాలసీదార్లకున్న భరోసాకు కారణం. విదేశీ పెట్టుబడుల్ని అనుమతించిన తర్వాత క్లయిము చేతికందేవరకూ డౌటే. టెలికం, బ్యాంకులు, ప్రైవేటు బీమా కంపెనీల్లానే లాభార్జన తప్ప వాగ్దానం నిలబెట్టుకోవడం, భరోసాను కాపాడుకోవడం ధ్యేయాలేవీ ఎల్ఐసీకి ఉండవు.
బోనస్కు గండి
ఎల్ఐసీ.. ప్రస్తుతం వస్తున్న లాభాల్లో 95 శాతం పాలసీదారులకు 5 శాతం ప్రభుత్వానికి ఇస్తుంది. ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలు 10 శాతం షేర్ హోల్డర్లకు 90 శాతం పాలసీదారులకు ఇస్తున్నాయి. ఎల్ఐసీ ప్రైవేటీకరణతో పాలసీ దారులకు ఇచ్చే బోనస్ మొత్తం కూడా 90 శాతానికే పరిమితం అయ్యే అవకాశాలున్నాయి. గత ఏడాది నాటికే ఎల్ఐసీ మొత్తం ఆస్తుల విలువ దాదాపు రూ.32 లక్షల కోట్లు. ఎల్ ఐసీ ఇచ్చిన కార్పోరేట్ రుణాల్లో 6 శాతం ఎన్పీఏలు ఉన్నట్టు అంచనా. ఇన్సూరెన్స్ రంగంలోకి ప్రవేట్ సంస్థలు అనుమతించిన తర్వాత ఎల్ఐసీ క్రమంగా కోల్పోతున్న మార్కెట్ వాటా పబ్లిక్ ఇష్యూ తర్వాత మరింత పతనం అయ్యే అవకాశాలున్నాయి.