ముంబై, సెప్టెంబర్ 2: దాదాపు గడిచిన 3 నెలల్లో దేశంలోకి 127 బిలియన్ డాలర్ల ఫారిన్ కరెన్సీ నాన్-రెసిడెంట్ (బ్యాంక్) లేదా ఎఫ్సీఎన్ఆర్(బీ) డిపాజిట్లు వచ్చాయి. ఈ మేరకు బుధవారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తెలిపింది. పశ్చిమాసియా సంక్షోభం, అంతర్జాతీయ మార్కెట్లో పెరుగుతున్న ముడి చమురు ధరలు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మందగమనం దృష్ట్యా కరిగిపోతున్న భారతీయ ఫారెక్స్ రిజర్వులను పెంచడానికి జూన్ 8న ప్రత్యేకంగా ఎఫ్సీఎన్ఆర్(బీ) స్వాప్ విండో, డిపాజిట్ స్కీమ్ను ఆర్బీఐ ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇది గత నెల 31న ముగిసింది. దీంతో జూన్ 8 నుంచి ఆగస్టు 31 వరకు మొత్తం 127.226 బిలియన్ డాలర్ల ఎఫ్సీఎన్ఆర్(బీ) డిపాజిట్లు వచ్చినట్టు తేలింది.
ఓవర్సీస్ ఫారిన్-కరెన్సీ బారోయింగ్స్ (ఓఎఫ్సీబీ), ఎక్స్టర్నల్ కమర్షియల్ బారోయింగ్స్ (ఈసీబీ)తో కలిపితే 136.377 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. కాగా, ఎఫ్సీఎన్ఆర్(బీ) డిపాజిట్లు ఫిక్స్డ్-టర్మ్ డిపాజిట్లు. విదేశీ కరెన్సీల్లో ఉంటాయి. డిపాజిట్ చేసినవారికి అదే కరెన్సీల్లో అసలు, వడ్డీలను చెల్లిస్తారు. ఈ డిపాజిటర్లకు డైరెక్ట్ రూపీ ఎక్సేంజ్-రేటు రిస్క్ నుంచి రక్షణ ఉంటుంది. దేశీయ బ్యాంకుల్లోకి ప్రవాస భారతీయుల విదేశీ కరెన్సీ నిధులను ఆకర్షించడానికి ప్రత్యేకంగా ఈ వెసులుబాటును కల్పించారు. అయితే విశేష ఆదరణ లభించడంతో నెల రోజుల ముందుగానే ముగించేశారు. నిజానికి ఈ నెల 30దాకా ఈ స్కీమ్ ఉండాల్సింది. రూపీ ఎక్చేంజ్ రిస్క్ లేకపోవడంతో ఈ డాలర్ల సమీకరణ భవిష్యత్తులో ఖజానాపై భారాన్ని పెంచుతున్నది మరి.