అవసరానికి బంధువుల వద్దో.. ఇరుగుపొరుగు దగ్గరో అప్పుచేసే రోజులు పోయాయి. ఇప్పుడు బ్యాంకులే వ్యక్తిగత రుణాలను అందిస్తున్నాయి. ఈ రుణాల కోసం పెద్ద ఎత్తున పత్రాలు, ఎటువంటి పూచీకత్తూ అక్కర్లేదు. అందుకే మిగతా రుణాలతో పోల్చితే వీటిపై వడ్డీరేట్లు కాస్త ఎక్కువగానే ఉంటాయి. కానీ వడ్డీరేటు నిర్ణయంలో రుణగ్రహీత సిబిల్ స్కోర్ కీలకపాత్ర పోషిస్తుంది. ఇక ఈ నిధులను ఎలా ఖర్చు చేస్తారన్నదీ ఎవరికీ చెప్పాల్సిన పనిలేదు. దీంతో చాలామంది ఈ పర్సనల్ లోన్లను తీసుకుంటున్నారు. అయితే ఈ రుణాలకూ కొన్ని ఫీజులు, చార్జీలుంటాయన్నది మీకు తెలుసా..
వ్యక్తిగత రుణాలిచ్చే సమయంలో బ్యాంకులకు కొన్ని ఖర్చులుంటాయి. వీటినే లోన్ ప్రాసెసింగ్ చార్జీలంటారు. తీసుకునే రుణ మొత్తంలో సాధారణంగా 0.5 శాతం నుంచి 2.5 శాతం వరకు ఇవి ఉంటాయనుకోవచ్చు. కనీసంగానైనా, గరిష్ఠంగానైనా ఈ చార్జీలను రుణగ్రహీతలు చెల్లించాల్సిందే.
రుణగ్రహీత రుణాన్ని తిరిగి చెల్లించగలరా?.. లేదా?.. అన్నది బ్యాంకులు తప్పక తెలుసుకుంటాయి. ఈ బాధ్యతను థర్డ్పార్టీ సంస్థలకు బ్యాంకు అప్పగిస్తుంది. ఆ సంస్థలు రుణగ్రహీతకు ఇంకా రుణాలేమైనా ఉన్నాయా?.. చెల్లింపుల చరిత్ర ఎంటన్నది తెలుసుకుంటాయి. ఇందుకు బ్యాంకుల నుంచి చార్జీలు వసూలు చేస్తాయి. ఈ భారం చివరకు రుణగ్రహీతపైనే పడుతుంది.
వ్యక్తిగత రుణం తీసుకున్నప్పుడు.. సమాన నెలసరి వాయిదా పద్ధతుల్లో (ఈఎంఐ) చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఈ చెల్లింపుల్లో విఫలమైతే జరిమానాలు తప్పవు. కాబట్టి మనం ఏ పరిస్థితుల్లోనైనా చెల్లించగలిగేలా ఈఎంఐలను ముందే నిర్ణయించుకోవడం ఉత్తమం.
రుణ బకాయిలను తెలుసుకునేందుకు బ్యాంకును సంప్రదించినప్పుడు డూప్లికేట్ స్టేట్మెంట్ ఫీజులు వర్తించే వీలున్నది. ఇక లోన్ అప్రూవల్, తర్వాతి కాలంలో అదనపు సేవలకు కొంతమొత్తంలో జీఎస్టీనీ చెల్లించాల్సి రావచ్చు.
చేతిలో నగదు ఉన్నప్పుడు రుణ విముక్తి కోసం ప్రయత్నించడం తెలివైన పనే. అయితే వ్యక్తిగత రుణాలు తీసుకున్నవారు ముందస్తుగా దాన్ని తీర్చాలని చేసే చెల్లింపులపై జరిమానాలుంటాయి.