Equity MF | న్యూఢిల్లీ, ఏప్రిల్ 10: ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ (ఎంఎఫ్)ల్లోకి పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతున్నది. గత నెల మార్చిలో మరో రూ.22,633 కోట్లను ఈక్విటీ ఎంఎఫ్లు ఆకర్షించాయి. అయితే అంతకుముందు నెల ఫిబ్రవరితో పోల్చితే మాత్రం 16 శాతం తగ్గాయి. నాడు రూ. 26,866 కోట్లుగా నమోదైనట్టు బుధవారం విడుదలైన దేశీయ మ్యూచువల్ ఫండ్స్ అసోసియేషన్ (యాంఫీ) గణాంకాలు చెప్తున్నా యి. అయినప్పటికీ వరుసగా 37వ నెల పెట్టుబడుల రాకే కనిపించింది. రంగాలవారీగా పెట్టుబడులపట్ల మదుపరులకు పెరిగిన ఆసక్తి, కొత్త ఫండ్ ఆఫర్లు పెరగడం కలిసొచ్చిందని నిపుణులు మార్కెట్ సరళిని విశ్లేషిస్తున్నారు.
సిప్ అదుర్స్
సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (ఎస్ఐపీ) నెలవారీ పెట్టుబడులు రికార్డు స్థాయికి చేరాయి. ఈ ఏడాది మార్చిలో రూ.19,270 కోట్లుగా ఉన్నాయి. ఫిబ్రవరిలో 19,187 కోట్లుగానే ఉన్నాయి. కాగా, గత ఆర్థిక సంవత్సరం మొత్తం సిప్ పెట్టుబడులు దాదాపు రూ.2 లక్షల కోట్లుగా ఉన్నాయి. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2022-23)తో పోల్చితే 28 శాతం ఎక్కువ. ఇక గత నెల హైబ్రిడ్ ఫండ్స్ రూ.5,584 కోట్లను ఆకర్షించాయి. అయితే డెట్ మ్యూచువల్ ఫండ్స్ నుంచి రూ.1.98 లక్షల కోట్లు తరలిపోయాయి. మరోవైపు మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ నుంచి మొత్తం పెట్టుబడుల ఉపసంహరణ ఈ మార్చిలో రూ.1.6 లక్షల కోట్లుగా ఉన్నది. మిడ్, స్మాల్క్యాప్ సూచీల్లో అధిక విలువలు, జనవరి-మార్చికిగాను అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లింపులే ఇందుకు కారణం. మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ నిర్వహణలోని ఆస్తుల విలువ ఫిబ్రవరి ఆఖరుతో చూస్తే మార్చి ఆఖరున రూ.54.54 లక్షల కోట్ల నుంచి రూ.53.4 లక్షల కోట్లకు తగ్గుముఖం పట్టింది.