న్యూఢిల్లీ, ఏప్రిల్ 15: దేశీయ ఎగుమతులు పడిపోయాయి. గతంతో పోల్చితే ఈ ఏడాది మార్చి నెలలో 7.44 శాతం క్షీణించాయి. గడిచిన 5 నెలల్లో ఇదే గరిష్ఠం. గత నెల వస్తూత్పత్తి ఎగుమతులు 38.92 బిలియన్ డాలర్లకే పరిమితమైనట్టు బుధవారం విడుదలైన కేంద్ర ప్రభుత్వ అధికారిక గణాంకాల్లో తేలింది మరి. అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధంతో పశ్చిమాసియాలో నెలకొన్న సంక్షోభం..
భారతీయ ఎగుమతుల్ని ప్రభావితం చేసినట్టు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేంద్ర వాణిజ్య కార్యదర్శి రాజేశ్ అగర్వాల్ తెలిపారు. అయితే దేశీయ ఎగుమతులపై ఈ ఏప్రిల్లోనూ యుద్ధ ప్రభావం ఉంటుందనడం గమనార్హం. ఇరాన్ తమ పరిధిలోని హొర్ముజ్ జలసంధిని మూసివేయడంతో సరుకు రవాణాకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని పేర్కొన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 28 నుంచి యుద్ధంతో పశ్చిమాసియా అట్టుడికిపోతున్న సంగతి విదితమే.
భారత్ నుంచి గల్ఫ్ దేశాలకు వివిధ రకాల వస్తూత్పత్తుల ఎగుమతులు జరుగుతాయి. అయితే యుద్ధంతో యూఏఈ, ఖతార్, కువైట్, ఒమన్, బహ్రెయిన్, సౌదీ అరేబియా దేశాలకు జరిగే ఆయా ఎగుమతులకు అంతరాయం ఏర్పడింది. ఈ క్రమంలోనే మార్చిలో మిడిల్ ఈస్ట్ రీజియన్కు భారతీయ ఎగుమతులు ఏకంగా 57.95 శాతం క్షీణించాయి. సాధారణంగా ప్రతి నెలా 6 బిలియన్ డాలర్లుగా ఉండే ఎగుమతులు.. ఈ మార్చిలో దాదాపు 2-2.5 బిలియన్ డాలర్లుగానే ఉన్నాయని రాజేశ్ అగర్వాల్ చెప్పారు. రత్నాలు, ఆభరణాలు, ఎలక్ట్రానిక్స్, ఇంజినీరింగ్, పెట్రోలియం ఉత్పత్తులు, బియ్యం ఎగుమతులు 3.5 బిలియన్ డాలర్ల మేర దెబ్బతిన్నాయని ఆయన వెల్లడించారు.
హొర్ముజ్ జలసంధిలో అవాంతరాలు.. దేశీయ దిగుమతుల్నీ ప్రభావితం చేశాయి. గత నెల మార్చిలో 6.51 శాతం క్షీణతతో 59.59 బిలియన్ డాలర్లుగానే ఉన్నాయి. నిరుడు మార్చిలో 63.75 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ఈ ఏడాది తగ్గిన ముడి చమురు, బంగారం దిగుమతులే కారణం. కాగా, ఈ మార్చిలో దేశీయ ఎగుమతుల కంటే దిగుమతులే ఎక్కువగా ఉండటంతో వాణిజ్య లోటు 20.67 బిలియన్ డాలర్లుగా ఉన్నది. ఇదిలావుంటే గత నెలలో గల్ఫ్ దేశాల నుంచి భారత్కు వచ్చిన దిగుమతులూ 51.64 శాతం పడిపోయినట్టు రాజేశ్ అగర్వాల్ వివరించారు.
భారత్-అమెరికా మధ్య వాణిజ్య చర్చలు ఈ నెల 20 నుంచి మొదలవుతాయని కేంద్ర వాణిజ్య కార్యదర్శి రాజేశ్ అగర్వాల్ తెలిపారు. ప్రతిపాదిత వాణిజ్య ఒప్పందంపై వాషింగ్టన్లో మూడు రోజులపాటు ఈ చర్చలు జరుగుతాయన్నారు. భారత బృందానికి దర్పన్ జైన్ నాయకత్వం వహిస్తారు. ఇదిలావుంటే భారత్-బ్రిటన్ మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్టీఏ) వచ్చే నెల మే నుంచి అమల్లోకి వస్తుందని రాజేశ్ స్పష్టం చేశారు.