IPL | ప్రపంచ కుబేరులు జెఫ్ బెజోస్, ముకేశ్ అంబానీ భారత్లో వాణిజ్యంపై పట్టు కోసం పోటీ పడుతున్నారు. రిలయన్స్లో దేశీయ రిటైల్ నెట్వర్క్ ఫ్యూచర్ విలీనంపై జెఫ్ బెజోస్ సారధ్యంలోని అమెజాన్ వివిధ న్యాయస్థానాల్లో పోరాడుతున్నారు. తాజాగా క్రికెట్ మ్యాచ్ల ప్రసార హక్కుల కోసం ముకేశ్ అంబానీతో జెఫ్ బెజోస్ పోటీ పడుతున్నారు. బీసీసీఐ ఆధ్వర్యంలో నిర్వహించే టోర్నీల ప్రసార హక్కుల వేలానికి ఇటీవలే మార్గదర్శకాలు జారీ అయ్యాయి. ఈ వేలంలో బిడ్ గెలుచుకున్న సంస్థకు వచ్చే ఏడాది (2023) నుంచి 2027 వరకు ఐపీఎల్ ప్రసారహక్కులు లభిస్తాయి.
ఇదిలా ఉంటే, తొలిసారి టీవీ చానెళ్లు, ఆన్లైన్ స్ట్రీమ్ చానెళ్లలో ప్రసార హక్కుల వేలానికి రంగం సిద్ధమైంది. దీంతో వేలంలో పాల్గొనేందుకు అమెజాన్ డాట్ కాం దాని అనుబంధ ప్రైమ్ వీడియో సర్వీసెస్ తలుపులు తెరిచినట్లయింది. ముకేశ్ అంబానీ సారధ్యంలోని రిలయన్స్ అనుబంధ జియో కూడా ఆన్లైన్ ప్రసార హక్కులను గెలుచుకోవాలని దృఢ నిశ్చయంతో ఉందని ఆయన సన్నిహిత వర్గాల కథనం.
జూన్ 12న టీవీ చానెళ్లు, లైవ్ స్ట్రీం ప్రసార హక్కుల వేలం ప్రారంభం కానున్నది. 700 కోట్ల డాలర్ల వరకు బిడ్లు దాఖలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. భారత్లో ఐపీఎల్ టోర్నీ అత్యంత పాపులర్. ఐపీఎల్ టోర్నీపై టీవీ చానెళ్లు, ఆన్లైన్ స్ట్రీమింగ్ ప్రసార హక్కులతో 140 కోట్ల మంది భారతీయుల వద్దకు తమ ఉత్పత్తుల ప్రచారాన్ని తీసుకెళ్లడం తేలికవుతుందని రిలయన్స్.. అమెజాన్ భావిస్తున్నాయి.