హైదరాబాద్: అందంగా కనిపించాలని చాలామంది ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. మెరిసే చర్మం కోసం ముఖానికి, ఒంటికి క్రీములు, లోషన్లు రాస్తారు. హెయిర్ స్టైల్లో, వస్త్రధారణలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. కండ్లకు ఐ లైనర్లు, పెదాలకు లిప్స్టిక్లు ఇలా వేటికీ వెనక్కి తగ్గరు. కానీ పాదాల సంరక్షణను మాత్రం గాలికి వదిలేస్తుంటారు. సుతిమెత్తగా ఉండాల్సిన పాదాల మడిమ భాగాల్లో పగుళ్లు వస్తే అందవికారంగా తయారవడమేగాక, తీవ్రంగా బాధిస్తాయి కూడా. కొన్ని చిన్నచిన్న చిట్కాలు పాటించడం ద్వారా ఈ సమస్య నుంచి బయటపడవచ్చు.
నోటి శుభ్రత కోసం ఉపయోగించే మౌత్వాష్ పౌడర్ చర్మానికి తేమను అందిస్తుంది. ఒక వెడల్పాటి బకెట్లో కొంచెం మౌత్వాష్ పౌడర్, నీళ్లు కలిపి అందులో పాదాలను 15 నిమిషాలు ఉంచాలి. తర్వాత నీళ్లతో పాదాలను శుభ్రం చేసుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది.
అదేవిధంగా యాంటీ మైక్రోబయల్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలున్న తేనె.. పగిలిన పాదాలకు చక్కని మాయిశ్చరైజర్గా పనిచేస్తుంది. పాదాలకు పగుళ్లు ఉన్నచోట కొద్దిగా తేనె రాసుకొని అరగంట తర్వాత శుభ్రం చేసుకోవాలి.
కొబ్బరి నూనె కూడా పొడి చర్మానికి తేమను అందించి తాజాగా మారుస్తుంది. రాత్రిపూట నిద్రపోయే ముందు పాదాలకు కొబ్బరి నూనె రాసుకుంటే పగుళ్ల బాధ తగ్గుతుంది.
సాధారణంగా ఫంగల్ ఇన్ఫెక్షన్ వల్ల కూడా పాదాలు పగుళ్లుబారుతాయి. అప్పుడు వెనిగర్ కలిపిన నీటిలో పాదాలను కొద్దిసేపు ఉంచితే పగుళ్లు తగ్గిపోతాయి.
పగిలిన పాదాలకు ఓట్మీల్, పాల మిశ్రమం కూడా మంచి ఔషధంగా పనిచేస్తుంది. ప్రతివారం ఈ మిశ్రమాన్ని పాదాలకు రాసుకుంటే పగుళ్లు మాయమవుతాయి.