హిమాచల్ ప్రదేశ్లో ఓ పోస్టాఫీస్ ఉంది. అది అత్యంత ఎత్తయిన తపాలా కార్యాలయం. హిమాచల్ అంటే తెలుసు కదా! హిమాలయ పర్వతాలు ఉండేది అక్కడే. ఆ పర్వతాల మధ్యలో.. ఓ మారుమూల గ్రామంలో ఉందీ కార్యాలయం. దాని పేరు ‘హిక్కిం’. అత్యంత ఎత్తయిన కొండలపైన ఉండటంతో ఇదే ప్రపంచంలో ఎత్తయిన పోస్టాఫీస్గా పేరుగాంచింది. సముద్ర మట్టానికి 4,400 మీటర్ల ఎత్తులో ఉంది. ఈ పోస్టాఫీసు నుంచి ప్రపంచ నలుమూలలకూ ఉత్తరాలు వెళ్తుంటాయి. ఇక్కడ ఐదు చిన్న చిన్న గ్రామాలున్నాయి. ఈ ప్రాంతంలో మొబైల్ సిగ్నల్స్ చాలా తక్కువ. ఇంటర్నెట్ అసలు ఉండదు. వీరి కోసమే ఈ పోస్టాఫీసును ఏర్పాటు చేశారు. ఉత్తరాలు పంపేందుకు, ఖాతాల్లో డబ్బు జమ చేసేందుకు నిత్యం గ్రామస్తులు వస్తుంటారు. ఇక్కడికి వచ్చే చాలా మంది పర్యాటకులు అత్యంత ఎత్తులోని ఈ పోస్టాఫీసు నుంచి ఉత్తరాలు పంపడాన్ని గొప్ప అనుభూతిగా భావిస్తారు. ప్రమాదకరమైన దారులు, ఎముకలు కొరికే చలి.. ఈ లోయ ప్రత్యేకత. ఇక్కడకు వెళితే ఓ కొత్త ప్రపంచానికి వెళ్లినట్టుగా ఉంటుంది. 1983లో భారత తపాలా శాఖ ఈ పోస్టాఫీసును ప్రారంభించింది. ఇక్కడి నుంచి ఉత్తరాలను బట్వాడా చేయాలంటే చాలావరకు కాలినడకనే వెళ్లాలి. విపరీతమైన మంచు కురుస్తున్నప్పుడు మూసేస్తారు. స్పితి లోయకు ప్రధాన కేంద్రంగా ఉన్న కాజా పట్టణానికి ఈ పోస్టాఫీసు నుంచి ఉత్తరాలు తీసుకెళ్తారు. రోజూ ఇద్దరు పోస్ట్మెన్లు కొండాకోనలను దాటుకుంటూ రానుపోను కలిపి దాదాపు 46 కిలోమీటర్లు నడుస్తారు. కాజా నుంచి హిమాచల్ ప్రదేశ్లోని ఇతర ప్రధాన పట్టణాలకు రోడ్డు మార్గాల ద్వారా బస్సుల్లో ఉత్తరాలను పంపుతారు.