న్యూఢిల్లీ: ముత్తూట్ గ్రూప్ చైర్మన్ ఎంజీ జార్జి ముత్తూట్ మరణం సహజంగా జరిగిందా? ఏదైనా కుట్ర ఉన్నదా? అన్న విషయమై సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఆయన మ్రుతదేహానికి పోస్ట్మార్టం చేసినఢిల్లీలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్) వైద్యుల బ్రుందం ఆదివారం సందేహాలు వ్యక్తం చేసింది. ఆయనది సహజ మరణంగా పరిగణించడం లేదని ఆ వైద్యుల టీం పేర్కొంది. ఏదైన కారణం ఉండొచ్చునని అభిప్రాయ పడింది.
శుక్రవారం రాత్రి ఢిల్లీలోని తూర్పు కైలాష్ ప్రాంతంలోని తన నాలుగంతస్తుల ఇంటిపై నుంచి కింద పడటంతో తీవ్రంగా గాయపడిన ఎంజీ జార్జి ముత్తూట్.. తర్వాత దవాఖానలో చికిత్స పొందుతూ మరణించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై దర్యాప్తునకు ఎయిమ్స్ ఫోరెన్సిక్ విభాగం ముగ్గురు సీనియర్ వైద్యులతో మెడికల్ బోర్డును ఏర్పాటు చేసింది. పోస్ట్మార్టం ప్రక్రియ మొత్తం వీడియోగ్రఫీ చేశారు.
ల్యాబోరేటరీ టెస్ట్, హిస్టాలజికల్ అండ్ కెమికల్ టెస్టులు నిర్వహించామని, దీనిపై నిర్ణయాన్ని పెండింగ్లో పెట్టామని ఎయిమ్స్ ఫోరెన్సిక్ విభాగం అధిపతి ప్రొఫెసర్ డాక్టర్ సుధీర్ కుమార్ గుప్తా చెప్పారు. ఇది ఆత్మహత్యా, ప్రమాదమా? హత్య జరిగిందా? అన్న నిర్ధారించుకోవాల్సి ఉందన్నారు.
మూడు కోణాల్లో తమ టీం ఈ కేసును పరిశీలిస్తున్నదని డాక్టర్ సుధీర్ కుమార్ గుప్తా తెలిపారు. నాలుగంతస్తుల భవనంపై నుంచి కింద పడటంతో గాయపడ్డారా? ఆయనపై విష ప్రయోగం జరిగిందా? అన్న విషయమై కెమికల్ టెస్ట్ నిర్వహించాల్సి ఉందని చెప్పారు. పోస్ట్మార్టం గాయాలపై తాము ఒక అవగాహనకు రావాల్సి ఉందన్నారు. సోమవారం నుంచి ఎయిమ్స్ ఫోరెన్సిక్ టీం అసెస్మెంట్ ప్రారంభించి వారం పది రోజుల్లో నిర్ణయానికి వస్తుందని గుప్తా వివరించారు.
ఎంజీ జార్జి ముత్తూట్ శుక్రవారం రాత్రి 9 గంటలకు నాలుగు అంతస్తుల భవనంపై నుంచి కింద పడటంతో గాయపడ్డారని ఢిల్లీ పోలీసులు తెలిపారు. ఆ వెంటనే చికిత్స కోసం ఫొర్టిస్ ఎస్కార్ట్ హాస్పిటల్కు తరలించగా, చికిత్స పొందుతూ మరణించారు. ఆయనకు భార్య సారా, ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు జార్జి ఎం జార్జి.. ముత్తూట్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, చిన్న కుమారుడు అలెగ్జాండర్ జార్జి డైరెక్టర్గా ఉన్నారు. రెండు కుమారుడు పాల్ ముత్తూట్ జార్జి 2009లో హత్యకు గురయ్యారు.
తూర్పు కైలాస్ ప్రాంతంలోని అమర్ కాలనీ పోలీస్ స్టేషన్ ఈ కేసు విచారిస్తున్నది. ఎంజీ జార్జి ముత్తూట్ ఇంట్లో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల్లో విజువల్స్ ప్రకారం శుక్రవారం సాయంత్రం 6.40 గంటలకు ఆయన టెర్రస్పైకి వెళ్లినట్లు తెలుస్తున్నది. అయితే, ఆయన టెర్రస్ పై నుంచి ప్రమాదవశాత్తు కిందపడటంతో మరణించారా? ఆత్మహత్య? అన్న విషయం తేల్చలేమని పోలీసులు చెబుతున్నారు. భవనం టెర్రస్పై సీసీటీవీ కెమెరాలు లేవు. దీంతో ఆయన ఎలా కింద పడ్డారో ట్రేస్ ఔట్ చేయలేకపోతున్నట్లు చెప్పారు. కుట్ర జరిగిందా? కుటుంబ సభ్యుల నుంచి ఆరోపణలు గానీ, కుట్ర జరిగినట్లు ఆధారాలు గానీ లేవని పోలీసులు అంటున్నారు.